భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ..స్వయంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

by Phanindra |   ( Updated:2025-05-10 13:12:15.0  )
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ..స్వయంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య యుద్ధవాతావరణానికి ఎండ్ కార్డ్ పడిందా? ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం నాడు సోషల్ మీడియా వేదికగా ఈ రెండు దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ను ట్రంప్ ప్రకటించారు. ‘రాత్రంతా కూర్చొని ఈ రెండు దేశాలతో యూఎస్ చర్చలు జరిపింది. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ చెయ్యడానికి ఒప్పుకున్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. ఇంగితజ్ఞానం, అద్భుతమైన తెలివితేటలతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ విషయానికి ప్రాముఖ్యతను ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ చెప్పారు.

ఈ వార్త రెండు దేశాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా భారత భూభాగాలు, సైనిక స్థావరాలు, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడులకు తెగబడింది. అంతేకాకుండా, ఎల్‌వోసీ వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ చర్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ దేశంలోని మూడు కీలక ఎయిర్‌బేస్‌లను, రెండు రాడార్ సైట్లను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఇరుదేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి చల్లబడిందనే చెప్పొచ్చు.



Next Story

Most Viewed