కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలు మళ్లీ మొదలు: పీయూష్ గోయల్

by Phanindra |

కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. 2023లో ఆగిన చర్చలు తిరిగి ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని పీయూష్ గోయల్ తెలిపారు.

కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలు మళ్లీ మొదలు: పీయూష్ గోయల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, కెనడా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలు తిరిగి ప్రాంభంకానున్నాయని, దీనికి ఇరుదేశాలూ అంగీకరించాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఎఫ్‌టీఏ లేక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (సెపా) అనేది రెండు దేశాల మధ్య ఉండే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గోయల్ చెప్పారు. ఈ ఒప్పందాల వల్ల పెట్టుబడిదారులకు, వ్యాపారాలకు నమ్మకం పెరుగుతుందని వివరించారు. ‘సెపా చర్చలు మళ్లీ మొదలు పెట్టేందుకు, అలాగే 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి’ అని ఆయన తెలిపారు.

ఈ రెండు దేశాలు కలిస్తే పెట్టుబడిదారులు, వ్యాపారాలకు రెట్టింపు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ‘మనం కెనడా నుంచి చాలా నేర్చుకోవచ్చు. అదే సమయంలో కెనడాకు మనం చాలా ఇవ్వొచ్చు. కీలకమైన ఖనిజాలు, వాటి ప్రాసెసింగ్ టెక్నాలజీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. కెనడాతో యురేనియం సరఫరాపై ఒప్పందం జరిగితే న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి’ అని గోయల్ పేర్కొననారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్ హస్తముందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధారాలు లేని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ చర్చలు కూడా అర్ధంతరంగా ఆగిపోయాయి.

Next Story