ఇజ్రాయెల్‌‌‌లోని భారతీయులకు రిస్క్.. విదేశాంగ శాఖ అలర్ట్

by Dishanational4 |
ఇజ్రాయెల్‌‌‌లోని భారతీయులకు రిస్క్.. విదేశాంగ శాఖ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాకు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ ‘హిజ్బుల్లా’.. ఇజ్రాయెల్‌పై దాడులను ముమ్మరం చేసింది. మార్చి 4న హిజ్బుల్లా జరిపిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు (పాట్ నిబిన్ మాక్స్‌వెల్) చనిపోగా, మనదేశానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మరోసారి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లోని తమ పౌరులందరి భద్రతపై దృష్టి సారించామని వెల్లడించింది. “ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు వివిధ పనులు చేస్తున్నారు. వారి భద్రత మాకు ఆందోళన కలిగిస్తోంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ప్రాణరక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన కోరారు. ఇప్పటికే దీనిపై ఒక అడ్వైజరీని జారీ చేశామన్నారు. ఎవరైనా భారతీయులకు సహాయం కావాలంటే రాయబార కార్యాలయాన్ని హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని రణధీర్ జైస్వాల్ తెలిపారు. పెద్దసంఖ్యలో భారతీయులను ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలపై ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ విషయంలో ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారు.



Next Story

Most Viewed