చిరంజీవి, వైజయంతిమాల పద్మవిభూషణ్ ఎందుకు తీసుకోలేదంటే..?

by Dishanational4 |
చిరంజీవి, వైజయంతిమాల పద్మవిభూషణ్ ఎందుకు తీసుకోలేదంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రమణ్యం, సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్‌ బదులుగా ఆయన సతీమణి అమోలా పాఠక్ పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. పద్మభూషణ్ అవార్డును అందుకున్న వారిలో నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీమంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉథుప్‌, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్‌ ఉన్నారు. పద్మశ్రీ అవార్డులను అందుకున్న వారిలో క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు ఉన్నారు. రాష్ట్రపతి భవన్​లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అత్యున్నత పౌర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు.

పద్మశ్రీ లిస్టులో..

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న వారిలో తెలంగాణలోని నారాయణపేటకు చెందిన అరుదైన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, గుజరాత్‌కు చెందిన కార్డియాలజిస్టు తేజస్ మధుసూదన్ పటేల్, ప్రఖ్యాత తివాచీ నేతన్న ఖలీల్ అహమద్, మధ్యప్రదేశ్ జానపద కళాకారుడు కాలూరాం బమానియా, బంగ్లాదేశీ గాయకులు రెజ్వానా చౌదరి బన్యా, చింకారీ ఎంబ్రాయిడరీ కళాకారిణి , యూపీకి చెందిన ససీం బానో తదితరులు ఉన్నారు.

నృత్యభంగిమలతో సాగిన ద్రోణా

పద్మశ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకునేందుకు వెళ్లుతున్నప్పుడు అసోం జానపద నాట్యకారుడు ద్రోణా భూయాన్ తన నృత్యభంగిమలను ప్రదర్శిస్తూ రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. సభికుల కరతాళ ధ్వనుల నడుమ పురస్కారం స్వీకరించారు. తన స్థానానికి వెళ్తూ ఆయన ప్రధాని మోడీ వద్దకు వెళ్లి పాదాలను తాకారు. ఇందుకు ప్రధాని నుంచి ప్రతి నమస్కారం దక్కింది. పద్మశ్రీ అందుకున్న త్రిపుర మత గురువు చిట్టా రంజన్ దేబ్బార్మ కాషాయదుస్తులలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయనతో ప్రధాని మోడీ కొద్ది సేపు ముచ్చటించారు. అసోంకు చెందిన గిరిజన రైతు సర్బేశ్వర్ బసుమతతరీ పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. ఈ దశలో ఆయన రాష్ట్రపతి ముందు మోకరిల్లారు. సోమవారం దాదాపు 67 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను బహూకరించారు. మిగిలిన వారికి వచ్చే వారం మరో కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి, వైజయంతిమాలా బాలీ పద్మవిభూషణ్ పురస్కారాలను తరువాతి దశలో తీసుకోనున్నారని వెల్లడైంది. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మొత్తం 132 మందికి!

2024లో వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి.

Next Story

Most Viewed