ట్రంప్ ప్రణాళికలు సరైన దిశలో వెళ్లడం లేదు

by Ajay Maddhiboyina |

వాణిజ్యపరమైన విషయాల్లో ఈయూ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అందుకే టారిఫ్‌లను పెంచడానికి నిర్ణయించుకున్నట్లు గురువారం ట్రంప్ చెప్పారు.

ట్రంప్ ప్రణాళికలు సరైన దిశలో వెళ్లడం లేదు
X

- టారిఫ్‌లపై ధీటుగా స్పందిస్తాం

- స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకి

- యూరోపియన్ యూనియన్ వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ప్రణాళికలు సరైన దిశలో వెళ్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆర్థిక అనిశ్చితి పెరగడమే కాకుండా, ప్రపంచ మార్కెట్ల సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకిగా మారే ఇలాంటి చర్యలపై ఈయూ త్వరలో ధీటుగా స్పందిస్తుందని పేర్కొంది. దిగుమతులపై ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లను ఈయూ విధిస్తోంది. ఈయూలో దిగుమతయ్యే 70 శాతం వస్తువులపై అసలు సుంకాలే లేవు. ఇలాంటి సమయంలో అమెరికా సుంకాలను పెంచేందుకు ప్రయత్నించడం వెనుక ఎలాంటి సమర్థనీయమైన అంశాలు కనపడటం లేదని ఈయూ ప్రకటనలో తెలిపింది.

అమెరికా మిత్రులు కొన్ని విషయాల్లో శత్రువుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరమైన విషయాల్లో ఈయూ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అందుకే టారిఫ్‌లను పెంచడానికి నిర్ణయించుకున్నట్లు గురువారం ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన టారిఫ్‌ల పెంపు ప్రణాళికపై ట్రంప్ సంతకం చేశారు. యూఎస్‌తో వాణిజ్యం చేస్తున్న ప్రతీ దేశానికి సంబంధించి టారిఫ్‌లను సవరిస్తామని.. ఆ దేశానికి చెందిన వస్తువులపై ఎంత టారిఫ్ విధిస్తుందో చూసి.. అదే విధంగా అమెరికా సుంకాలను పెంచుతుందని ట్రంప్ తెలిపారు. కాగా, టారిఫ్‌లు పెంచడం అంటే ట్యాక్సులు పెంచడమే. అమెరికా ఇలా టారిఫ్‌లు పెంచి తమ పౌరులపైనే రుద్దుతుందని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ధరలు పెరిగితే వ్యాపారాలపై భారం పడుతుంది. ఒక విధంగా ట్రంప్ ద్రవ్యోల్బణం పెంచడానికి ఆజ్యం పోస్తున్నారని ఈయూపేర్కొంది.

Next Story