బైజూస్ పై ఈడీ రైడ్స్

by Disha Web Desk 12 |
బైజూస్ పై ఈడీ రైడ్స్
X

న్యూఢిల్లీ : ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందనే అభియోగాలతో ఆన్‌లైన్ ట్యుటోరియల్ పోర్టల్ "బైజూస్‌"కు చెందిన బెంగళూరులోని మూడు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం ఉదయం కంపెనీకి సంబంధించిన 2 ఆఫీసులు.. "బైజూస్‌" సీఈవో బైజు రవీంద్రన్ నివాసంలో రైడ్స్ చేశారు. కొందరు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు చేశామని ఈడీ వెల్లడించింది. "బైజూస్‌"లో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇంతకుముందు తాము సమన్లు జారీ చేసినా .. ఆయన విచారణకు డుమ్మా కొట్టారని ట్విట్టర్ వేదికగా ఈడీ తెలిపింది.

ఈ తనిఖీల్లో నేరాభియోగాలను బలపరిచే పలు డాక్యుమెంట్స్, డిజిటల్ డేటా లభ్యమైందని వెల్లడించింది. " 2011 నుంచి 2023 మధ్య కాలంలో బైజూస్‌ కంపెనీ దాదాపు రూ. 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు ఫెమా శోధనలు వెల్లడించాయి. ఇదే కాలంలో ఓవర్ సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వివిధ విదేశీ సంస్థలకు దాదాపు రూ. 9,754 కోట్లను బైజూస్‌ పంపినట్లు గుర్తించాం" అని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈడీ తెలిపింది. "2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బైజూస్‌ కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదు. తప్పనిసరిగా కంపెనీ అకౌంట్స్‌ను ఆడిట్ చేయించాలనే నిబంధనలు ఉన్నా .. అలా చేయలేదు" అని ఈడీ వివరించింది.

కంపెనీ యాడ్స్, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో దాదాపు రూ. 944 కోట్లను అకౌంట్స్ లో నమోదు చేసి.. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే కొన్ని కంపెనీలకు ఆ ఫండ్స్ ను పంపించిందని ఈడీ పేర్కొంది. ఈనేపథ్యంలో రైడ్స్ సందర్భంగా బైజూస్‌ అధికారులు అందించిన లెక్కల వాస్తవికతను బ్యాంకుల ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేయిస్తున్నామని ఈడీ చెప్పింది. నిధుల వ్యవహారంలో కంపెనీ పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని బైజూస్ లీగల్ టీం తెలిపింది. కంపెనీపై జరిగిన ఈడీ రైడ్స్ ఫెమా కింద "సాధారణ విచారణ"కి సంబంధించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. "మేము ఈడీ అధికారులతో పూర్తిగా పారదర్శకంగా వ్యవహహరించాం. వారు అడిగిన మొత్తం సమాచారాన్ని అందించాము. మా కార్యకలాపాల సమగ్రతపై మాకు అత్యంత విశ్వాసం ఉంది. మేము కంపెనీ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం " అని బైజూస్ వెల్లడించింది.



Next Story

Most Viewed