మొబైల్‌ యాప్‌తో ఓటింగ్.. బిహార్‌ స్థానిక ఎన్నికల్లో యూజ్ చేసిన ఈసీ!

by Phanindra |

మొబైల్‌ యాప్‌తో ఓటు వేసే సౌకర్యాన్ని ఈసీ అందుబాటులోకి తెచ్చింది. బిహార్‌ స్థానిక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది.

మొబైల్‌ యాప్‌తో ఓటింగ్.. బిహార్‌ స్థానిక ఎన్నికల్లో యూజ్ చేసిన ఈసీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రక్రియలో బిహార్ చరిత్ర సృష్టించింది. దేశంలో తొలిసారిగా మొబైల్ ఫోన్‌తోనే ఓటు వేసే ప్రక్రియకు బిహార్ స్థానిక ఎన్నికల్లో శ్రీకారం చుట్టారు. దీని కోసం ‘ఈ-ఎస్‌ఈసీబీహెచ్‌ఆర్’ (e-SECBHR) అనే యాప్‌ను తయారు చేసిన ఈసీ.. బిహార్‌లోని ఆరు మున్సిపల్ కౌన్సిల్‌ల ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌కు రాలేని వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులు, తదితరులకు ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుందని, అలాగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని బిహార్ ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ఓటర్లు యాప్‌లో లేదా బిహార్ ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైటులో కూడా ఓటు వేయొచ్చు.

యాప్ ప్రత్యేకతలు..

ఈ-ఎస్‌ఈసీబీహెచ్‌ఆర్ (e-SECBHR) యాప్‌ను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో తయారు చేశారు. కాబట్టి ఓట్లను రికార్డ్ చేయడంతో పాటు సురక్షితంగా స్టోర్ చేయొచ్చు. అలాగే ఫేస్ రికగ్నిషన్‌, ఓటర్ ఐడీతో లాగిన్, ఓటింగ్ సమయంలో ఓటర్ల ధ్రువీకరణ జరుగుతుంది. డిజిటల్ స్కానింగ్-ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)తో ఓట్లను కచ్చితంగా లెక్కించవచ్చు. అలాగే వీవీప్యాట్‌ల వలె ఓట్లను సరిపోల్చే వీలు కూడా ఉంటుంది. సీ-డాక్ తయారు చేసిన ఈ యాప్.. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఎలా పనిచేస్తుంది?

  • ఈ యాప్‌తో ఓటు వేయాలనుకునే వాళ్లు ముందుగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఓటర్ ఐడీ, ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
  • పోలిగ్ జరిగే రోజున ఏ సమయంలో అయినా ఓటు వేయొచ్చు.
  • ఒక మొబైల్ నెంబరుతో గరిష్ఠంగా ఇద్దరు ఓటర్లు మాత్రమే లాగిన్ చేసే వీలుంటుంది.
  • ఓటరు ఐడీ నెంబరుతో ప్రతి ఓటరు వెరిఫికేషన్ జరుగుతుంది.
Next Story