విమానం నడపనంటూ మొండికేసిన పైలట్.డిప్యూటీ సీఎం పర్యటన ఆలస్యం..ఎందుకంటే?

by Ramesh Naini |   (  Updated:2025-06-07 07:24:36  IST  )

డిప్యూటీ సీఎం శుక్రవారం జల్గావ్ నుంచి ముంబయికి ప్రయాణం దాదాపు గంట ఆలస్యం అయింది.

విమానం నడపనంటూ మొండికేసిన పైలట్.డిప్యూటీ సీఎం పర్యటన ఆలస్యం..ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (DCM Eknath Shinde) శుక్రవారం జల్గావ్ నుంచి ముంబయికి ప్రయాణం దాదాపు గంట ఆలస్యం అయింది. డిప్యూటీ సీఎం వ్యక్తిగత విమానం పైలట్.. తన పని గంటలు ముగిశాయని చెప్పి విమానం నడపనంటూ మొండికేశాడు. సంత్ ముక్తాయ్ 'పాల్ఖీ యాత్ర' (మతపరమైన ఊరేగింపు)లో పాల్గొన్న శివసేన చీఫ్, డిప్యూటీ సీఎం షిండే జల్గావ్ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో (Jalgaon Airport) ఎయిర్‌పోర్టులోనే డీసీఎం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన వెంట మంత్రులు గిరీశ్ మహాజన్ (Girish Mahajan), గులాబ్‌రావ్ పాటిల్ (Gulabrao Patil), మరికొందరు అధికారులు ఉన్నారు.

దీంతో విమాన సంస్థ ప్రతినిధులతో మంత్రి గిరీశ్‌ వివరాలు తెలుసుకున్నారు. పైలట్‌ ఆరోగ్యం సరిగా లేనందువల్లే అలా జరిగిందని మంత్రి గిరీశ్‌ మహాజన్‌ వివరణ ఇచ్చారు. దాదాపు 45 నిమిషాల చర్చ తర్వాత విమానం నడపడానికి అధికారులు పైలట్‌ను ఒప్పించారు. చివరకు విమానం ముంబైకి బయలుదేరింది. కాగా, తిరుగు ప్రయాణంలో షిండే, అతని బృందం ముంబాయిలో అత్యవసరంగా కిడ్నీ శస్త్రచికిత్స చేయిచుకోవాల్సిన ఒక మహిళను రక్షించారు. శీతల్ పాటిల్ అనే ఆ మహిళ కిడ్నీ శస్త్రచికిత్స కోసం తన భర్తతో కలిసి ముంబైకి వెళ్లాల్సి ఉండగా, ఆ జంట విమానం మిస్ అయ్యారు.

ఆ మహిళ దుస్థితి గురించి తెలుసుకున్న షిండే, మంత్రి మహాజన్ వారి ప్రణాళికలో భాగంగా ఆ జంటను విమానంలో తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా, మహిళ కోసం ముంబాయి విమానాశ్రయంలో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. సామాన్యులకు సాయం చేయడంలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ముందుంటారని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని మంత్రి పాటిల్ మీడియాకు తెలిపారు.

Next Story