ఎలక్టోరల్ బాండ్ల రద్దు.. మోడీ సర్కారు తొలి స్పందన ఇదే.. వాట్స్ నెక్ట్స్ ?

by Dishanational4 |
ఎలక్టోరల్ బాండ్ల రద్దు.. మోడీ సర్కారు తొలి స్పందన ఇదే.. వాట్స్  నెక్ట్స్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసిన మరుసటి రోజు (శుక్రవారం) కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన స్పందన వెలువడింది. ఈ తీర్పును తాము అధ్యయనం చేస్తున్నామని కేంద్ర సర్కారు వర్గాలు తెలిపాయి. ఈవిషయంలో తమ ఎదుట ఉన్న ఆప్షన్లను ప్రస్తుతం కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. రాజకీయ పార్టీలకు అందే విరాళాల లెక్కలను ప్రభుత్వం పరిధిలోకి తేవడంతో పాటు నల్లధనాన్ని విరాళాలుగా అందించే సంప్రదాయానికి అడ్డుకట్ట వేసే సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచ్చామనే అభిప్రాయంతో కేంద్రం పెద్దలు ఉన్నట్లు సమాచారం. రాజకీయ విరాళాలను అందించే దాతల పేర్లను బహిర్గతం చేస్తే బ్యాంకింగ్ చట్టాలకు తూట్లు పొడిచినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. కేంద్ర ఎన్నికల సంఘంలోకి సభ్యులను నియమించే విధానంలో మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పులో వ్యతిరేకించింది. అయినప్పటికీ మోడీ సర్కారు ఆ అంశంపై ప్రత్యేక బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమైన బిల్లును తీసుకొచ్చే సాహసానికి కేంద్ర సర్కారు సిద్ధపడకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Next Story

Most Viewed