‘కాంగ్రెస్ ఆక్రమిత బీజేపీ’: చవాన్ రాజీనామాపై ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు

by Dishanational2 |
‘కాంగ్రెస్ ఆక్రమిత బీజేపీ’: చవాన్ రాజీనామాపై ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ పార్టీకి రాజీనామా చేయడంపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకు లేదని విమర్శించారు. అందుకే ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఒకప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని ఇచ్చిందని, కానీ త్వరలో కాషాయపార్టీ కాంగ్రెస్ ఆక్రమిత బీజేపీగా మారుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు కూడా మాజీ కాంగ్రెస్ నాయకుడేనని గుర్తుచేశారు. మరఠ్వాడాలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. ‘అశోక్‌ నిర్ణయంతో నేను ఆశ్చర్యపోయాను. నిన్న మొన్నటి వరకు ఆయన లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాల చర్చల్లో పాల్గొన్నారు. కానీ అకస్మాత్తుగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం షాక్‌కు గురిచేసింది’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని ప్రధాని మోడీ చెబుతున్నప్పటికీ ఆయనకు విజయంపై నమ్మకం లేదన్నారు. గత పదేళ్లలో ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ నిజాయితీగా పని చేసి ఉంటే ప్రతిపక్షాలను విచ్చిన్నం చేస పరిస్థితి ఉండేది కాదని తెలిపారు.

నేడు బీజేపీలోకి చవాన్!

సోమవారం కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన అశోక్ చవాన్ మంగళవారం బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో చవాన్ కాషాయపార్టీలోకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అమ్ర్ రాజుర్కర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. చవాన్‌కు రాజ్యసభ సీటు ఖరారైందని తెలుస్తోంది. మరోవైపు చవాన్ పార్టీని వీడటంపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed