చండీగఢ్ మేయర్ రాజీనామా: సుప్రీంకోర్టు విచారణకు ముందే కీలక పరిణామం

by Dishanational2 |
చండీగఢ్ మేయర్ రాజీనామా: సుప్రీంకోర్టు విచారణకు ముందే కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన బీజేపీ నేత మనోజ్ సోంకర్ తన పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు అందజేసినట్టు చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా తెలిపారు. అయితే మేయర్ ఎన్నికకు జనవరి 30న ఎన్నికలు జరగగా స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ బీజేపీకి ఈ పదవి దక్కింది. ఓట్ల లెక్కింపు టైంలో మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు రాగా, ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన కుల్దీప్ ధలోర్‌కు 12 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లలో ఎనిమిది చెల్లవని ప్రకటించారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి అవకతవకలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆప్ ఆరోపించాయి. అంతేగాక ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుండగా..మేయర్ మనోజ్ రాజీనామా చేయడం గమనార్హం.

మళ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీదే విజయం!

ఒక వేళ చండీగఢ్ మేయర్ పదవికి మళ్లి ఎన్నికలు జరిగితే బీజేపీ విజయం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. బీజేపీకి ఇప్పటికే 15 ఓట్లు ఉన్నాయి. ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో ఆ సంఖ్య 18కి చేరింది. అంతేగాక అకాలీదళ్‌కు చెందిన ఒక ఓటుతో కలిపితే ఈ సంఖ్య 19కి చేరుతుంది. ఈ క్రమంలో మేయర్ ఎన్నికలను తిరిగి నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తే బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఆప్-కాంగ్రెస్ కూటమికి కేవలం 17ఓట్లు మాత్రమే ఉన్నాయి.



Next Story

Most Viewed