కేజ్రీవాల్ సర్కారుపై మరో పిడుగు.. ఫేక్ మెడిసిన్స్‌ సప్లైపై సీబీఐ విచారణ

by Dishanational4 |
కేజ్రీవాల్ సర్కారుపై మరో పిడుగు.. ఫేక్ మెడిసిన్స్‌ సప్లైపై  సీబీఐ విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌ల కోసం నకిలీ, నాణ్యత లేని ఔషధాల కొనుగోలు, సరఫరాపై సమగ్ర విచారణ చేయాలని సీబీఐని కేంద్ర సర్కారు ఆదేశించింది. డిసెంబరు నెలలో దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన సిఫార్సు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన ఈ సిఫార్సు చేసిన మరుసటి రోజే(డిసెంబరు 26న).. ఢిల్లీలోని ఏడు మొహల్లా క్లినిక్‌లలో జరిగిన మోసాల చిట్టా ఢిల్లీ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది. డమ్మీ రోగులకు వైద్య పరీక్షలు చేసి.. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సంస్థల జేబుల్లోకి డబ్బులను మళ్లిస్తున్నారని ఆనాడు గుర్తించారు. దీనిపై అప్పట్లో కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విజిలెన్స్ విభాగం.. ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యత లేని మందుల సరఫరాపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ వ్యవహారాన్ని ఇప్పుడు సీబీఐకి అప్పగించింది.

ఢిల్లీ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఇక ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై స్పందించిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా.. ఇది ఢిల్లీ సీఎం అహంకారానికి నిదర్శనమన్నారు. ‘‘యూపీఏ -2 హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు బయటపడ్డప్పుడల్లా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పలేక మీడియాకు దూరంగా ఉండేవారు. నేడు కేజ్రీవాల్‌ కూడా అదే పని చేస్తున్నారు. ఈ విచారణ నుంచి తప్పించుకొని కేజ్రీవాల్ ఎంతదూరం పరుగెడతారో చూద్దాం.. ఆయన ఈడీ ముందు తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed