- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు.. త్వరలో అమల్లోకి VB-G RAM G చట్టం
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి.. VB-G RAM G చట్టానికి అమల్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రతిష్టాత్మకమైన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం, 2025' (VB-G RAM G-2025) అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది. 20 ఏళ్ల క్రితం నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) 2005 స్థానంలో ఈ కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ మార్పులు చేసినట్లు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గ్రామీణ కార్మికులకు మరింత భరోసా
ఈ కొత్త చట్టం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కల్పించే చట్టబద్ధమైన ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. దీనివల్ల గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ భద్రత లభించడంతో పాటు గ్రామీణాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.95,692 కోట్ల భారీ కేటాయింపులు చేసింది. వేతన చెల్లింపుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, నిర్ణీత సమయంలోగా చెల్లింపులు జరిగేలా ఈ చట్టంలో కఠిన నిబంధనలు చేర్చారు. మరీ ముఖ్యంగా.. పని కోరిన వారికి నిర్ణీత సమయంలోగా పని కల్పించలేకపోతే, వారికి నిరుద్యోగ భృతిని అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఇది గ్రామీణ కార్మికులకు మరింత భరోసానిస్తుంది. వేతనాల పంపిణీలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు పటిష్టమైన సాంకేతిక వ్యవస్థను కూడా ప్రభుత్వం రూపొందించింది.
ఈ పథకంలో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చట్టం ఒక వినూత్న నిబంధనను ప్రవేశపెట్టింది. పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ (Childcare) కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. పని స్థలంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, వారిని చూసుకోవడానికి ఒక మహిళా కార్మికురాలిని ప్రత్యేకంగా నియమిస్తారు. దీనివల్ల మహిళలు ఎటువంటి ఆందోళన లేకుండా తమ పనిని కొనసాగించే అవకాశం కలుగుతుంది.






