'ఇండియా' కూటమి పేరుపై వివరణకు చివరి అవకాశం

by Dishanational1 |
ఇండియా కూటమి పేరుపై వివరణకు చివరి అవకాశం
X

దిశ, నేషనల్ బ్యూరో: విపక్ష రాజకీయ పార్టీలు తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు అయిన సంగతి తెలిసిందే. దీనిపై తమ వివరణ ఇచ్చేందుకు మంగళవారం హైకోర్టు కేంద్ర, ప్రతిపక్ష పార్టీలకు చివరి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని త్వరగా విచారించాలని కోరుతూ పిటిషనర్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు అందుకు నిరాకరించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనం వివరణ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 10న విచారించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ఇటీవల ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) బదులిస్తూ.. ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియా అనే పదాన్ని ఉపయోగించే విషయంలో రాజకీయ పొత్తులను నియంత్రించలేమని తెలిపింది. పిటిషనర్ గిరీష్ ఉపాధ్యాయ తన పిల్‌లో వివిధ రాజకీయ పార్టీలు తమ కూటమి చిహ్నంగా జాతీయ జెండాను ఉపయోగిస్తున్నాయని, దీనివల్ల సామాన్య పౌరుల నుంచి సానుభూతిని, ఓట్లనూ ఆకర్షించేందుకు సాధనంగా వాడుకుంటున్నాయని, ఇది రాజకీయ ద్వేషానికి, రాజకీయ హింసకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఇండియా అనే పదాన్ని దురుద్దేశంతో ఉపయోగిస్తున్నాయని, దీనివల్ల మన దేశంలోనే కాకుండా వివిధ అంతర్జాతీయ వేదికలపైన కూడా భారత గౌరవాన్ని తగ్గించేలా ఉందని ఆరోపించారు.



Next Story

Most Viewed