ఏ రైలైనా ఎక్కేయడానికి.. సుప్రీంకోర్టు రైల్వే ప్లాట్‌ఫామేం కాదు.. న్యాయవాదిపై సీజేఐ వ్యాఖ్య

by Dishanational4 |
ఏ రైలైనా ఎక్కేయడానికి.. సుప్రీంకోర్టు రైల్వే ప్లాట్‌ఫామేం కాదు.. న్యాయవాదిపై సీజేఐ వ్యాఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : సాధారణంగానైతే ముందస్తుగా లిస్టింగ్ అయి ఉన్న కేసులను మాత్రమే రోజూ నిర్ణీత వేళల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలు విచారణ చేస్తుంటాయి. కానీ సోమవారం మధ్యాహ్నం టైంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం సభ్యులు ఆసీనులై ఉండగా ఓ న్యాయవాది అకస్మాత్తుగా లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) గురించి చెప్పసాగారు. దానిపై అత్యవసర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం విచారణ కోసం లిస్టింగ్ కాని ఆ పిటిషన్ గురించి సదరు లాయర్ ప్రస్తావించే సరికి సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు. ‘‘మీరు ఏ రైలయినా ఎక్కేయొచ్చు అనుకునేందుకు సుప్రీంకోర్టు అనేది రైల్వే ప్లాట్‌ఫామ్ కాదు. మీరు ఎవరైనా సీనియర్ లాయర్‌తో కలిసి మాట్లాడండి. కోర్టులో ఎలా ప్రవర్తించాలి.. కేసు విషయాలను ఎప్పుడు ప్రస్తావించాలి.. ఎలా ప్రజెంటేషన్ మొదలుపెట్టాలో తెలుసుకోండి’’ అని లాయర్‌కు సీజేఐ సూచించారు. ‘‘మీరు ఎక్కడ లా ప్రాక్టీస్ చేస్తుంటారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదరు లాయర్‌ను ప్రశ్నించారు. న్యాయవాది స్పందిస్తూ.. హైకోర్టు, దిగువ కోర్టుల్లో పిటిషనర్ల తరఫున హాజరవుతుంటానని బదులిచ్చారు. కొంతకాలం ఒక సీనియర్ లాయర్ దగ్గర పనిచేసి కోర్టులో ఎలా వ్యవహరించాలనేది నేర్చుకోవాలని లాయర్‌కు సీజేఐ హితవుపలికారు.


Next Story