కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం.. 8 మంది మృతి!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-24 16:44:36  IST  )

నదిలో ముత్యపు చిప్పల వేటకోసం వెళ్లిన పడవ బోల్తా పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం.. 8 మంది మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: నదిలో ముత్యపు చిప్పల వేటకోసం వెళ్లిన పడవ బోల్తా పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ సమీపంలోని వెంకటాపుర నదిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరాలీ పరిధిలోని శారదాహోళె గ్రామానికి చెందిన 14 మంది ఆదివారం నదిలోకి ముత్యపు చిప్పల కోసం పడవలో బయల్దేరారు. నదిలోకి వెళ్లే కొద్దీ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఆ నీటి ఉద్ధృతిలో పడవలో ఉన్నవారంతా కొట్టుకుపోయారు.

ఈ ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే భత్కల్ రూరల్ పోలీసులకు సమాచారమిచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే 8 మంది మరణించినట్లు సమాచారం. కొందరిని మాత్రం సురక్షితంగా రక్షించి, స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు గల్లంతవ్వగా.. వారి ఆచూకీ కోసం మత్స్యకారులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరణించినవారిలో ఏడుగురు మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబాల్లో, శారదాహోళె గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story