ఈసీ సర్క్యులర్‌పై బీజేపీ సీల్.. అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-24 09:25:16  IST  )

కేరళ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెలువడిన పత్రంపై బీజేపీ స్టేట్ కమిటీ సీల్ ఉండటం రాజకీయంగా దుమారం రేపింది.

ఈసీ సర్క్యులర్‌పై బీజేపీ సీల్.. అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం!
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓ అధికారిక సర్క్యులర్‌పై భారతీయ జనతా పార్టీ (BJP) సీల్ ఉండటం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎన్నికల సంఘం (EC) వివరణ ఇస్తూ.. ఇది కేవలం ‘క్లరికల్ మిస్టేక్’ అని స్పష్టం చేసింది. అయితే, అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించడానికి సంబంధించి 2019 నాటి మార్గదర్శకాలపై క్లారిఫికేషన్ ఇస్తూ కేరళ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం రాజకీయ పార్టీలకు ఓ పత్రాన్ని పంపింది. అయితే, ఆ అఫిడవిట్ కాపీపై ‘బీజేపీ కేరళ స్టేట్ కమిటీ’ అనే సీల్ కనిపించడంతో ప్రతిపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), కాంగ్రెస్ అవాక్కయ్యాయి. ఎన్నికల కమిషన్ నేరుగా బీజేపీ కార్యాలయం నుంచే పని చేస్తోందా.. అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించాయి.

క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం..

అయితే, ఈ వివాదంపై కేరళ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరణ ఇస్తూ.. అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన నిబంధనలపై స్పష్టత కోరుతూ గతంలో బీజేపీ రాష్ట్ర విభాగం తమను సంప్రదించిందని తెలిపారు. ఆ సమయంలో వారు 2019 నాటి పాత డైరెక్టివ్ కాపీని సమర్పించారని దానిపై వారి పార్టీ సీల్ ఉందని పేర్కొన్నారు. ఆ కాపీని పరిశీలించిన సిబ్బంది, పొరపాటున అదే ఫోటో కాపీని ఇతర రాజకీయ పార్టీలకు కూడా సమాచారం కోసం పంపారని వెల్లడించారు. అయితే, పొరపాటును గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ పత్రాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు, జిల్లా ఎన్నికల అధికారులకు దీనిపై వివరణ ఇస్తూ సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఎన్నికల సన్నద్ధతపై ఈసీఐ భారీ కసరత్తు.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంపు!

Next Story