Supreme Court: సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్

by Shamantha N |

సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట దక్కింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.

Supreme Court: సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట దక్కింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తామని జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఘన విజయం దక్కింది. కాగా.. డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది.

గవర్నర్ చర్యలపై ఆగ్రహం

తమిళనాడు గవర్నర్ తీరును తీవ్రంగా సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యలు పక్కన పెడుతున్నట్లు కోర్టు పేర్కొంది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బిల్లులను తిరిగి సమర్పించినప్పుడు వాటిని క్లియర్ చేసి ఉండాల్సిందని బెంచ్ పేర్కొంది. "ఇది గవర్నర్ అధికారాలను ఏ విధంగానూ అణగదొక్కడం లేదు. గవర్నర్ అన్ని చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలి." అని కోర్టు స్పష్టం చేసింది. ఇక, అసెంబ్లీలో ఆమోదించిన కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యను పక్కన పెడుతున్నట్లు వెల్లడించింది.

Next Story