ఏకంగా మహిళా మంత్రిపై దాడి.. ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు

by Kema Shiva Kumar |

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌పై జరిగిన దాడికి సంబంధించి కన్నూర్ జిల్లా KSU అధ్యక్షుడితో సహా ఐదుగురు విద్యార్థి నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఏకంగా మహిళా మంత్రిపై దాడి.. ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్‌ (Veena George)పై జరిగిన దాడి ఘటనలో కన్నూర్ టౌన్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU)కు చెందిన ఐదుగురు నేతలపై హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం కన్నూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వెళ్తున్న మంత్రిని కేఎస్‌యూ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్య నిర్లక్ష్య ఘటనలపై నిరసిస్తూ వారు నల్లజెండాలతో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మంత్రి వీణా జార్జ్‌కు మెడ భాగంతో పాటు చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కన్నూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఐదుగురు ప్రధాన నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో కేఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎంసీ అతుల్, జిల్లా ట్రెజరర్ అక్షయ్ మట్టూల్, సీహెచ్ ముబాజ్, బితుల్ బాలన్, మహమ్మద్ యాసిన్ ఉన్నారు.

ఈ ఘటనను సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య నిరసన కాదని, ఒక మహిళా మంత్రిపై జరిగిన క్రూరమైన దాడి అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మంత్రి చుట్టూ 30 మందికి పైగా పోలీసులు ఉన్నారని, విద్యార్థులు ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదని వారు వాదిస్తున్నారు. ఇది కేవలం సానుభూతి కోసం ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు.

Next Story