చెత్త ఏరుతున్న వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా పోస్ట్.. అతనెవరో తెలిస్తే షాకవ్వడం ఖాయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-23 13:59:25  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ఏదొక ఆసక్తికర పోస్ట్ చేస్తుంటారు.

చెత్త ఏరుతున్న వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా పోస్ట్.. అతనెవరో తెలిస్తే షాకవ్వడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ఏదొక ఆసక్తికర పోస్ట్ చేస్తుంటారు. తాజాగా వీధుల్లో చెత్త ఏరుతున్న ఓ వ్యక్తి గురించి ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు. పరిశుభ్రత కోసం పరితపిస్తూ.. వీధుల్ని శుభ్రంగా ఉంచేందుకు అలుపెరగని రీతిలో కృషి చేస్తున్నారు. ఆయనే 88 ఏళ్ల ఇందర్ జిత్ సింగ్ సిద్ధు. చండీగఢ్ సెక్టార్ 49కి చెందిన రిటైర్డ్ డీఐజీ. తాను చేస్తున్న పని వల్ల సమాజంలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నమ్ముతూ.. చండీగఢ్ లో చెత్తను ఏరి రిక్షాలో తీసుకెళ్లి పడేస్తున్నారు.

ఆ వ్యక్తి గురించి ఆనంద్ మహీంద్రా స్వచ్ఛతా యోధుడు అని కీర్తిస్తూ.. ఆ యోధుడికి నా సలాం అని రాసుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సిద్ధు తన సైకిల్ రిక్షాపై బయల్దేరి చండీగఢ్ సెక్టార్ 49లోని రోడ్ల పక్కన ఉన్న చెత్తను ఏరివేస్తూ ముందుకు సాగుతారు. జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో చండీగఢ్ కు మంచి ర్యాంకు రాకపోవడంతో బాధపడిన ఆయన.. ఫిర్యాదులు చేయడంతో ఆగిపోకుండా.. తనవంతు పనిచేయాలని రంగంలోకి దిగి, కృషి చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా సమాజంలో మార్పు తేవాలని ఆయన చేస్తున్న కృషి చూస్తుంటే.. ఆలోచనకు రిటైర్మెంట్ ఉండదని నిరూపితమవుతోందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

Next Story