ప్రజాధనంతో విదేశాల్లో జల్సా చేసిన ముగ్గురు కలెక్టర్లు

by Dishanational1 |
ప్రజాధనంతో విదేశాల్లో జల్సా చేసిన ముగ్గురు కలెక్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రజాధనంతో విచ్చలవిడిగా విదేశాల్లో షికార్లు చేసిన వ్యవహారం చండీగఢ్‌లో బయటపడింది. ప్రజల సొమ్ముతో ప్యారిస్ టూర్‌కు వెళ్లడం, ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్ టికెట్లతో ప్రయాణం చేయడం, ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌లో బస చేయడం ద్వారా ముగ్గురు కలెక్టర్లు లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఈ ఘటన 2015లో పంజాబ్ గవర్నర్‌గా కెప్టెన్ సింగ్ సోలంగికి అదనపు బాధ్యతలు నిర్వహించిన సమయంలో జరిగింది. ఈ వ్యవహారాన్ని తాజాగా చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ (సెంట్రల్) నివేదిక బహిర్గతం చేసింది. ఆ అధికారులు చండీగఢ్ సలహాదారునిగా చేసిన విజయ్ దేవ్, హోం సెక్రటరీగా అనురాగ్ అగర్వాల్, సెక్రటరీగా విక్రంత్ దేవ్‌. ఇది మాత్రమే కాదు.. వాస్తవానికి దిగువ స్థాయి అధికారి యూటీ చీఫ్ ఆర్కిటెక్ట్ కోసం ఉద్దేశించిన ఆ పర్యటనకు అనుమతి లేకుండా ఈ ముగ్గురు అధికారులు వెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్ కోసం స్విస్-ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లే కార్బుసియర్ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆ కంపెనీ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్యారిస్‌లో ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికోసం చండీగఢ్ ప్రభుత్వానికి ఆహ్వానం పంపారు. నిజానికి ఈ ఆహ్వానం చండీగఢ్ ఆర్కిటెక్ట్ విభాగానికి వచ్చింది. కానీ, సదరు ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు విజయ్ దేవ్, విక్రమ్ దేవ్‌దత్, అనురాగ్ అగర్వాల్ వెళ్లేందుకు హోం శాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. పైగా ఒకరోజు పర్యటనను ఏడు రోజులకు పొడిగించారు. నిబంధనల ప్రకారం, విదేశీ ప్రయాణం ఐదు రోజులు దాటితే, స్క్రీనింగ్ కమిటీ నుంచి అనుమతి అవసరం. కానీ వారు ఏడు రోజుల పర్యటనకు ఎటువంటి ఆమోదం తీసుకోలేదని ఆడిట్ నివేదిక తెలిపింది. ప్యారిస్ వెళ్లడానికి ముగ్గురు అధికారులకు రూ. 18 లక్షల వరకు ఖర్చు చేయడానికి హోం శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ, వారు విలాసవంతమైన పర్యటన కోసం రూ. 25 లక్షలకు పైగా ఖర్చు చేసి జల్సా చేసోచ్చారు.



Next Story