Narappa Movie Review : ‘నారప్ప’ రివ్యూ.. విక్టరీ కొట్టిన వెంకీ!

by  |
narappa
X

దిశ, సినిమా : బలవంతుడు, బలహీనుడికి నడుమన పోరాటం ఈనాటిది కాదు. తరాలు మారినా, తండ్రులు తాతలైనా నేటికీ బీదోడిపై ధనవంతుడి దాడి కొనసాగుతూనే ఉంది. మిద్దెల్లో ఉన్నోడిది ఎప్పుడైనా నేలబారు బుద్ధే. లక్షల ఎకరాల భూమి ఉన్నా.. పేదోడికున్న ఒక్క ఎకరంపైనే వాడి కన్ను. దాన్ని కొల్లగొట్టేందుకు సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తుంటాడు. ఈ అన్యాయానికి పోలీసులు వంత పాడవచ్చు. ఈ క్రమంలో ముందుగా బలవంతుడు పైచేయి సాధించినా చివరకు న్యాయమే గెలుస్తుంది. కానీ పేదోడి జీవన పోరాటానికి ఫుల్‌స్టాప్ లేదా? వాడికున్న కొద్దిపాటి భూమికి కూడా సొసైటీలో రక్షణ లేదా? అనే ప్రశ్న తలెత్తక మానదు. అందుకే ‘భూమి ఉంటే లాక్కుంటాడు.. ధనం ఉంటే కొల్లగొడుతాడు.. అదే చదువుంటే ఎవడూ దోచుకోలేడు’ అనే స్టోరీలైన్‌తో తెరకెక్కిన ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తమిళ చిత్రం ‘అసురన్’ రీమేక్‌గా వచ్చిన మూవీని ‘హీరో విక్టరీ వెంకటేశ్’ ఒరిజినాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా వన్ మ్యాన్ షోతో నడిపించగా.. హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.

స్టోరీ..

నారప్ప(వెంకీ).. భార్య సుందరమ్మ(ప్రియమణి), ముగ్గురు పిల్లలు ముని కన్నా(కార్తీక్ రత్నం), సిన్నబ్బ (రాఖీ), బుజ్జమ్మ(చిత్ర)తో పాటు బావ(రాజీవ్ కనకాల)తో కలిసి అనంతపురం జిల్లాలోని ఓ పల్లెటూరులో జీవిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద కొడుకు ముని కన్నాకు పెళ్లి చేసి తనను సంతోషంగా చూడాలని ఆశిస్తారు. అదే సమయంలో ఊరి పెద్ద పండు స్వామి(నరేన్).. తమ్ముడు దొరస్వామి నిర్మించబోయే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం లక్షల ఎకరాలు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. కానీ దొరస్వామి మాత్రం నారప్పకు చెందిన మూడెకరాల భూమి కూడా కావాలంటాడు. అమ్మోరు నిండుగా ఉన్నా.. బొట్టు లేకపోతే ఎలా? అంటూ తన వాదనను సమర్థించుకుంటాడు.

ఇదిలా ఉంటే, మూడెకరాల్లో అరటి పంట వేసిన నారప్ప.. రాత్రిపూట అడవి పందులు పంటను నాశనం చేస్తాయనే భయంతో ఇద్దరు కొడుకులతో కలిసి కాపలాకు వెళ్తాడు. ఈ క్రమంలో అడవి పందిని వేటాడుతుండగా.. పండు స్వామి చేనుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తీగలు తగిలి నారప్ప పెంపుడు కుక్క చనిపోతుంది. ఆ తీగలు మనుషులకు తగిలితే పరిస్థితి ఏంటని? నారప్ప, మునికన్నాలు పంచాయితీ ముందు పండుస్వామిని నిలదీస్తారు. కానీ ఇవేమీ లెక్క చేయని పండుస్వామి.. నారప్ప, తనకు పొత్తుగా ఉన్న బావి నీటిని మోటారు ద్వారా పూర్తిగా తోడేసేందుకు ట్రై చేస్తాడు. ఇది చూసి ఎదురుతిరిగిన సుందరమ్మపై చేయివేయడంతో ముని కన్నా.. పండుస్వామి కొడుకుపై చేయిచేసుకుంటాడు. అయితే పోలీసులతో సత్సంబంధాలున్న పండుస్వామి.. మునికన్నాను పోలీస్ స్టేషన్‌లో పెట్టిస్తాడు. ఇదే క్రమంలో తనను వదిలేయాలంటే ఆ మూడెకరాలు ఇవ్వాలని షరతు పెడతాడు దొరస్వామి. కానీ తన భార్యకు పుట్టింటి వారిచ్చిన ఆ భూమిని ఇవ్వలేనని, అది తప్ప వేరే ఏం నిర్ణయించినా పంచాయితీకి కట్టుబడి ఉంటానని చెప్తాడు నారప్ప. దీంతో తన కులానికి చెందిన ప్రతీ ఒక్కరి కాళ్లు మొక్కాలని దొరస్వామి కోరడంతో.. కొడుకును కాపాడుకునేందుకు నారప్ప అందుకు ఒప్పుకుంటాడు. షరతు ప్రకారం మునికన్నాను పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టినా.. తండ్రి కాళ్లు మొక్కితేనే తనను వదిలిపెట్టారన్న విషయం తెలుసుకున్న మునికన్నా ఊరిపెద్ద పండుస్వామిని చెప్పుతో కొడతాడు. ఇది మనసులో పెట్టుకున్న పండుస్వామి కోపంతో రగిలిపోతూ మునికన్నా తల నరికేసి దారుణంగా హత్య చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌ కాగా, వెంకీతో పాటు చిన్న కొడుకు సినబ్బ పాత్రలో కనిపించిన రాఖీ, ప్రియమణి ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశారు. పెళ్లీడుకొచ్చిన కొడుకును పోగొట్టుకున్న తల్లి ఏడాది పాటు తిండి కూడా మరిచిపోతే.. తండ్రి నారప్ప తాగుడుకు బానిస కావడంతో కుటుంబం చిందరవందరగా మారిపోతుంది. తల్లిదండ్రుల పరిస్థితి చూసి చలించిపోయిన సినబ్బ చివరకు పండుస్వామిని హత్య చేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

పెద్ద కొడుకును కడసారి కూడా చూసుకోలేకపోయిన నారప్ప.. కనీసం చిన్నకొడుకునైనా కాపాడుకోవాలని పడే తపన, మరోవైపు తన అన్నను మర్డర్ చేసిన నారప్ప కుటుంబాన్ని అంతం చేసేందుకు దొరస్వామి చేస్తున్న ప్రయత్నాలు, ఎవరు ఎలాంటి ఎత్తులు వేశారు? చివరికి ఎవరు నెగ్గారు? అప్పటి దాకా ముగ్గురి పిల్లలకు తండ్రిగా ఎమోషనల్‌గా కనిపించిన నారప్ప.. ఎదురుతిరిగి ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించాడు? తండ్రిగా సక్సెస్ అయిన వెంకీ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏంటి? అనేది కథ.

నటీనటుల పనితీరు..

పలు డిజాస్టర్స్ తర్వాత రీమేక్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నేటివిటీకి తగినట్లు సినిమాను మలిచినా.. ఒరిజినల్ మూవీలో ఉన్న ఎమోషన్స్‌ను క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కథతో పాటు సాగుతున్న పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నారప్పను మరో లెవల్‌లో నిలబెట్టాయి. ముఖ్యంగా వెంకీ నటన సినిమాకు ప్రాణం పోయగా.. సినబ్బ(రాఖీ)కు ప్రత్యేక అభినందనలు దక్కాల్సిందే. ముని కన్నా(కార్తీక్ రత్నం) పాత్రలో కనిపించింది కొద్దిసేపే అయినా యాక్టింగ్ స్కిల్స్‌కు ఫిదా అయ్యేలా చేశాడు. ప్రియమణి, రాజీవ్ కనకాల తమ సీనియారిటీని ప్రూవ్ చేస్తూ సినిమా సక్సెస్‌లో భాగం కాగా.. మూవీలో వచ్చే ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్‌కు చాలా కాలం వరకు గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు.

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. సంచలన నిజాలు వెలుగులోకి..


Next Story

Most Viewed