కలెక్టర్‌కు ట్విట్.. స్పందించి అంబులెన్స్ ఏర్పాటు

by  |
కలెక్టర్‌కు ట్విట్.. స్పందించి అంబులెన్స్ ఏర్పాటు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది సమయం సాయంత్రం ఆరు గంటలు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు కరోనా అనుమానిత లక్షణాలతో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. తీవ్రమైన దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఏ వాహనం రావట్లేదు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడం వల్ల ఎవరూ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో యువకుడు తీవ్రంగా ఇబ్బంది పడుతూనే అంబులెన్సుకు కాల్ చేశాడు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఏం చేయాలో తోచక ఆ యువకుడు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను.. ‘సార్ మాది కొంపెల్లి గ్రామం.. నాకు శ్వాస ఆడడం లేదు. తీవ్రమైన జ్వరం, దగ్గు ఉంది. అంబులెన్సుకు కాల్ చేస్తే ఏలాంటి రెస్పాన్స్ లేదు. ప్లీజ్ నా కోసం అంబులెన్స్ పంపించండి’ అంటూ ఆ యువకుడు ట్విట్టర్‌లో కలెక్టర్‌ను కోరాడు. వెంటనే ఈ ట్వీట్‌కు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పందించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి అంబులెన్సును ఏర్పాటు చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు కృషి చేశారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చొరవపై జిల్లా వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed