నేను మోడీని కాను.. అబద్ధాలాడను: రాహుల్

by  |
నేను మోడీని కాను.. అబద్ధాలాడను: రాహుల్
X

గువహతి: అసోంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ 24 గంటలు అబద్ధాలాడుతారని ఆరోపించారు. ‘నేను ఇక్కడికి వచ్చింది మీకు అబద్ధాలు చెప్పడానికి కాదు. నా పేరు నరేంద్ర మోడీ కాదు. ఒక వేళ మీకు అసోం, రైతుల గురించి లేదా ఇతర ఏ అబద్ధాలైనా వినాలనిపిస్తే మీ టీవీ ఆన్ చేయండి. నరేంద్ర మోడీని చూడండి. ఆయన మాటలు వినండి, సరిపోతుంది. ఆయన రోజులో 24 గంటలు దేశంపై అబద్ధాలు గుమ్మరిస్తారు’ అని కామరూప్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పేర్కొన్నారు.

ఈ ర్యాలీకి ముందు ఆయన గువహతిలో కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం యువతను పట్టించుకోదని, వారికి ఉపాధి కల్పించడంపై శ్రద్ధ పెట్టదని విమర్శించారు. అది కాకుండా అసోం భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలపై దాడికి పాల్పడుతున్నదని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడమంటే అసోంపై దాడిగానే చూడాలని అన్నారు. అందుకే అసోంలో తాము అధికారంలోకి రాగానే సీఏఏ అమలును అడ్డుకుంటామని వివరించారు.


Next Story

Most Viewed