అలాంటి వారు అసలు ఫిల్మ్ మేకర్‌గా పనికిరారు.. సింగీతం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

ఈ రోజుల్లో కొందరు యంగ్ డైరెక్టర్లకు వారి కథల మీద వారికే నమ్మకం ఉండటం లేదు అని ఆయన కుండబద్దలు కొట్టారు.

అలాంటి వారు అసలు ఫిల్మ్ మేకర్‌గా పనికిరారు.. సింగీతం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: తెలుగు చలనచిత్ర రంగానికి ఎన్నో వినూత్నమైన చిత్రాలను అందించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులో మళ్ళీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘SSR61’ గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాను ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తుండటం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రాబోతున్న ఈ మూవీక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 94 ఏళ్ల వయసులో కూడా కొత్తదనం కోరుకునే సింగీతం సాహసం చేయడం పట్ల సినీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగీతం శ్రీనివాసరావు, నేటి తరం దర్శకులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజుల్లో కొందరు యంగ్ డైరెక్టర్లకు వారి కథల మీద వారికే నమ్మకం ఉండటం లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఒక ఉదాహరణ చెబుతూ.. ఒక యువ దర్శకుడు తన దగ్గరకు వచ్చి కథ చదవమని కోరాడని, అందులో తప్పులు ఉన్నాయనే విషయం ఆ దర్శకుడికే తెలుసని, అయినా సింగీతం బాగుంది అంటే బాగుంది అని, లేదు అంటే లేదు అని అంటున్నట్లు ఆయన వివరించారు. "దర్శకత్వం అంటే అలా కాదు.. తమ విజన్ పట్ల స్పష్టత లేని వారు ఫిలిం మేకర్స్‌గా అస్సలు పనికిరారు" అని సింగీతం ఘాటుగా చెప్పారు. ఒక దర్శకుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం తన ఆలోచన మీద తనకు ఉండే నమ్మకం అని ఆయన గుర్తు చేశారు. పదిమంది మాటలకు ప్రభావితం కాకుండా, తమ సొంత ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. "నేను ఆదిత్య 369, పుష్పక విమానం వంటి సినిమాలు చేసినంత మాత్రాన నేను చెప్పేది గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ కథపై మీకు స్పష్టత ఉండాలి" అని ఆయన యువ దర్శకులకు చెప్పారు.

Next Story