వయసు పెరుగుతోంది.. శరీరం తట్టుకోలేకపోతోంది.. భూమి పెడ్నేకర్ హాట్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-31 04:55:00  IST  )

మనం ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండాలని అనుకోకూడదు, మన పనికి మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే క్రేజ్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది.

వయసు పెరుగుతోంది.. శరీరం తట్టుకోలేకపోతోంది.. భూమి పెడ్నేకర్ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ నటి భూమి పెడ్నేకర్, న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ' (IFFD) 2026 వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణం, మారుతున్న తన ప్రాధాన్యతలు, తన శరీర బరువులో వస్తున్న మార్పుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2015లో 'దమ్ లగా కే హైషా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవ్వడానికి ముందు, ఆమె యష్ రాజ్ ఫిల్మ్స్‌లో కాస్టింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇక తన కెరీర్ గురించి భూమి మాట్లాడుతూ.. "మనం ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండాలని అనుకోకూడదు, మన పనికి మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే క్రేజ్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది. మనలోని కళాకారుడిని అర్థం చేసుకుని, నిరంతరం సాధన చేయడం ముఖ్యం" అని తెలిపారు. ఇక గత కొంతకాలంగా భూమి బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. "చాలా ఏళ్లుగా నేను సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉన్నాను.

కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల శరీరానికి ఆ సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఇప్పుడు పాత్రల కంటే నా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆమె ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు. భరత్ మండపంలో జరుగుతున్న ఈ వేడుకలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని, ఢిల్లీకి ఇలాంటి ఒక ఫెస్టివల్ చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. ఇక భూమి సినిమాల విషయానికి వస్తే.. 2025లో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి నటించిన 'మేరే హస్బెండ్ కీ బీవీ' ప్రేక్షకులను అలరించింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్' విమర్శల పాలైనప్పటికీ, వ్యూయర్ షిప్‌లో రికార్డులు సృష్టించింది. 2026 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన 'డాల్డా' క్రైమ్ థ్రిల్లర్‌లో ముంబై పోలీస్ ఆఫీసర్‌గా భూమి చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Next Story