మూడు గంటలు భయంతో వణికిపోయా.. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను: రానా

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-11 09:14:14  IST  )

రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు.

మూడు గంటలు భయంతో వణికిపోయా.. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను: రానా
X

దిశ, సినిమా: రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. పలు సినిమా ఈవెంట్లకు గెస్ట్‌గా కూడా వస్తున్నారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రానా దగ్గుబాటి తన జీవితంలో మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. ‘‘అరణ్య (aranya)షూటింగ్ సమయంలో మేము అడవిలో ఉండాల్సి వచ్చింది. కొన్ని సీన్స్ ఏనుగులు ఉండే ప్రాంతంలో షూట్ చేశాం. అయితే సాయంత్రం అయ్యే సమయానికి అందరూ వెళ్లిపోయేవారు. కానీ అనుకున్న టైమ్‌కి మా షూట్ పూర్తి కాకపోవంతో రాత్రి వరకు అక్కడే ఉన్నాం. నేను సీన్ చేస్తూ దూరంగా ఉన్నాను. ఆ సమయంలోనే అందరూ గబా గబా వెళ్లిపోతున్నారు. ఎందుకు ఏమైందని చూస్తే.. ఏనుగులు మా వైపుకు వస్తున్నాయి. దీంతో టీమ్ అంతా వాటికి కనిపించకుండా.. చెట్ల చాటుకు దాచుకున్నాం.

కొంచెం కూడా శబ్దం చేయకుండా చిమ్మ చికట్లో మూడు గంటలపాటు భయపడుతూ ఉన్నాం. ఈ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అడవి ఎంత భయకరంగా ఉంటుందో మొదటిసారి అర్థమైంది’’ అని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రానా, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని ప్రభు సాల్మన్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2021లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. రానా సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘కాంత’తో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ‘పరాశక్తి’లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

Next Story