ఒడిషాపై నార్త్ఈస్ట్ యునైటెడ్ గెలుపు

by  |
ఒడిషాపై నార్త్ఈస్ట్ యునైటెడ్ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం తిలక్ మైదాన్‌లో ఒడిషా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 3-1 తేడాతో విజయం సాధించింది. టాస్ గెల్చిన నార్త్ఈస్ట్ యునైటెడ్ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత 9వ నిమిషంలోనే నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆటగాడు అశుతోష్ మెహతా ఇచ్చిన పాస్‌ను లూయిస్ మచాదో గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 19వ నిమిషంలో ఫ్రెడిరికో గలేగో ఇచ్చిన పాస్‌ను దేశ్రోన్ బ్రౌన్ గోల్‌గా మలిచి నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. 24వ నిమిషంలో ఫ్రెడ్‌రిక్ గలేగో ఇచ్చిన పాస్‌ను లూయిస్ మచాదో మరోసారి గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆధిక్యం 3-0కి చేరింది. తొలి అర్దభాగం ముగుస్తుంది అనగా ఒడిషా ఆటగాడు దానియల్ లాలింపుయా ఇచ్చిన పాస్‌ను బ్రాడెన్ ఇన్‌మాన్ గోల్ పోస్టులోకి పంపాడు. ఇక రెండో అర్దభాగంలో ఏ జట్టు కూడా ఒక్కగోల్ కూడా చేయలేదు. నిర్ణీత సమయం ముగిసే సరికి అధిక గోల్స్ ఉన్న నార్త్ఈస్ట్ యునైటెడ్ 3-1 తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో నార్త్ఈస్ట్ యునైటెడ్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డుతో పాటు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఫ్రెడ్రికో గలేగోకు లభించింది.

ఇక ఆదివారం రాత్రి ఫటోర్డా స్టేడియంలో జంషెడ్‌పూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్‌బగాన్ క్లబ్ 1-0 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన జంషెడ్‌పూర్ క్లబ్ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇరు జట్లు మొదటి నుంచి హోరాహోరీగా తలపడ్డాయి. పలుమార్లు గోల్ పోస్టుపై దాడి చేయడానికి ప్రయత్నించినా మొదటి అర్దభాగంలో ఒక్క గోల్ కూడా సాధించలేదు. ఇక మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుంది అనగా 85వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ ఇచ్చిన పాస్‌ను రాయ్ కృష్ణ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో ఏటీకే మోహన్ బగాన్ జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఏటీకే మోహన్ బగాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. డేవిడ్ విలియమ్స్‌కు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, రాయ్ కృష్ణకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Next Story