రైతులను మించిన సైంటిస్టులు ఎవరూ లేరు : ఆర్ నారాయణమూర్తి

by  |
రైతులను మించిన సైంటిస్టులు ఎవరూ లేరు : ఆర్ నారాయణమూర్తి
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : రైతులను మించిన శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అన్నారు. శనివారం కొత్తకోట మండలం శ్రీదేవి థియేటర్‌లో నియోజకవర్గంలోని అన్నదాతల కోసం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతన్న సినిమా ప్రదర్శన కోసం బయలుదేరిన నారాయణ మూర్తి కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం సమీపంలో గట్టు యాదవ్ అనే రైతు మూడున్నర ఎకరాల పొలంలో సాగు చేసిన మినుము పంటను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి నారాయణ మూర్తి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులు, కూలీలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను మించిన శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏ నేలలో ఏ పంటలు ఎప్పుడు వేయాలి. ఏ ఎరువులు చల్లాలనే ప్రతి విషయం రైతులకు తెలుసునన్నారు. అటువంటి అన్నదాతలు కష్టపడి పండించే పత్తి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయవలసిందేనని డిమాండ్ చేశారు. రైతులు పంట మార్పిడి చేయాలని అప్పటికప్పుడు చెబితే సరిపోదు. రెండు సంవత్సరాల ముందు నుంచే రైతులను అందుకు సిద్ధం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో చేతులెత్తేయడం సరికాదన్నారు. నల్ల చట్టాలను తెచ్చి రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాట మాడుతోందని నారాయణమూర్తి ఆరోపించారు. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని నారాయణమూర్తి చెప్పారు.

కళ్లకు కట్టినట్లు చూపారు : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

‘రైతన్న’ సినిమా రైతులు పంట పండించడానికి, కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్న విధానాలను ఆర్.నారాయణమూర్తి కళ్ళకు కట్టినట్లు చూపారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలోని శ్రీదేవి సినిమా థియేటర్‌లో రైతన్న సినిమాను నియోజకవర్గంలోని రైతులు, ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఎమ్మెల్యే సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, తీసుకువచ్చిన చట్టాలను గురించి రైతులు గమనించాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దఎత్తున రైతులు థియేటర్‌కు తరలివచ్చి సినిమా చూడడానికి సహకరించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఆర్.నారాయణ మూర్తి కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed