కమీషన్ల కోసమే మిషన్ భగీరథ.. డీ  ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్వీర్యంకు ఎమ్మెల్యే కుట్ర

by  |
కమీషన్ల కోసమే మిషన్ భగీరథ.. డీ  ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్వీర్యంకు ఎమ్మెల్యే కుట్ర
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని 22వ వార్డులో ప్రజలకు కుళాయిల ద్వారా అందించే నీరు గత వారం రోజులుగా రావడం లేదు. నీటి ఎద్దడితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని నిరసిస్తూ గాంధీ జయంతి సాక్షిగా 22 వ వార్డు మహిళలు బిందెలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు పెండెం రామానంద్ లు మాట్లాడుతూ… పట్టణ ప్రజలకు నీటిని ప్రతి రోజూ అందించడంలో నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ చైర్మన్, నియోజకవర్గ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

ప్రజలకు కుళాయిల ద్వారా వచ్చే నీరు ప్రతిరోజు రాక నానా ఇబ్బందులు పడుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22వ వార్డులో ఉన్న బొంద బడి ఆవరణలో గల వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు అందించాలని పలుమార్లు కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నర్సంపేట శాసనసభ్యులు ఇంటింటికీ నల్ల నీళ్లు అందిస్తామని ఎన్నికలకు ముందు హామీలతో ప్రజలను మభ్య పెట్టారని, ఆచరణలో ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ఉపయోగంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టు ద్వారా నీటిని నర్సంపేట పట్టణ ప్రజలకు అందించకుండా కేవలం కమీషన్ల కోసమే మిషన్ భగీరథ ఎత్తుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారుల నిర్వాకంతో కాంట్రాక్టర్ల ద్వారా అధికార పార్టీ నాయకుల జేబులు మాత్రం నిండాయన్నారు.

అధికారులు స్పందించి పట్టణ ప్రజలకు ప్రతి రోజు నల్ల నీళ్లు అందించాలని లేదంటే పట్టణ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, ములుకల వినోదసాంబయ్య, జిల్లా నాయకులు ఓర్సు తిరుపతి, మాజీ ప్రజాప్రతినిధులు గాజుల రమేష్ , మెర్గు సాంబయ్య, వడ్డే కుమారస్వామి, పేరం బాబు రావు, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, అడెపు రమాదేవి ములుకల మనీష్ గద్ద అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story