నా వ్యాఖ్యలను తప్పుగా చిత్రించారు: సీజేఐ

by  |
CJI
X

న్యూఢిల్లీ : లైంగికదాడి కేసు విచారిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిందితుడి బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటూ బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా? అని అడగటం కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వచ్చింది. తాజాగా, ఆ వ్యాఖ్యలపై సీజేఐ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా చిత్రించి సుప్రీంకోర్టు ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. మీడియా సంస్థలు, కార్యకర్తలు తన వ్యాఖ్యల ఉద్దేశ్యాన్ని తప్పుగా చిత్రించారని విమర్శించారు. ఆ కేసులోని విచారణ మొత్తాన్నీ అవాస్తవంగా రిపోర్ట్ చేశారని అన్నారు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా? అని అడగలేదని తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావా? అని అడిగామని వివరించారు. అంతేకానీ, పెళ్లి చేసుకోవాలని పేర్కొనలేదని సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలపై సుప్రీంకోర్టుకు ఉన్నతమైన గౌరవముందని వివరించింది. ఎవిడెన్స్ యాక్ట్‌లోని 165 సెక్షన్ ప్రకారం, నిజాలను వెలికి తీయడానికి ఎలాంటి ప్రశ్నలనైనా కోర్టు అడిగే అధికారముందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా వివరించారు. కేసు విచారణలో సరైన సందర్భంలోనే ‘పెళ్లి చేసుకుంటావా?’ అనే ప్రశ్న అడిగారని, అందులో దోషమేమీ లేదని తెలిపారు.

Next Story

Most Viewed