డైయిరీ రంగంలో స్వావలంభన సాధించాలి

by  |
డైయిరీ రంగంలో స్వావలంభన సాధించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: పశు, మత్స్య, డైయిరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేలా ప్రణాళికాబద్దంగా వ్యహరించాలని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. అరణ్యభవన్‌లో మంగళవారం మంత్రులు పశు సంవర్థక, మత్స్య, ఆర్థిక శాఖ అధికారులతో సంయుక్తంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలకు రోజు పాలు సరఫరా చేస్తున్నామని, దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని వివరించారు. ఈ పరిస్థితి తలెత్తకుండా టెట్రా ప్యాక్‌లో విజయా డైరీ ద్వారా పాలు పంపేలా ప్రణాళికలు సిద్దం చేశామని, దీనికోసం ఆర్థిక వనరులు సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. దీనిపై పూర్తిగా పరిశీలన చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు.

గోపాల మిత్రకు నిధులు నాలుగు నెలల నుంచి విడుదల కావాల్సి ఉందని, పాల సేకరణకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్సెంటీవ్‌ను విడుదల చేయాలని మంత్రి తలసాని కోరారు. పశువులకు నట్టల మందులు తప్పకుండా వేయాలని, మేకలు, గొర్రెల బరువు పెరుగుతాయని ఇందుకు తగిన నిధులు కావాలని సూచించారు. దేశంలో పశు, మత్స్య సంపదలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ దూరదృష్టితో అద్బుత ఫలితాలు సాధిస్తోందన్నారు. విజయ డెయిరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఉమ్మడి పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఫిష్ ఔట్‌లెట్ వాహనాలను మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పరిశీలించారు.


Next Story