ఇది అందరి హైదరాబాద్ : కేటీఆర్

by  |
ఇది అందరి హైదరాబాద్ : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రగతి నివేదికను విడుదల చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక న్యాయం పాటిస్తూ.. అభ్యర్థుల ఎంపిక జరిగిందని అన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న గొడవ కూడా జరుగలేదని వెల్లడించారు. అంతేగాకుండా ఇది అందరి హైదరాబాద్ అని… ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని తెలిపారు. టికెట్ రాని వారి ఇంటికి వెళ్లి వారి సహకారాన్ని కోరాలి అని అభ్యర్థులకు సూచించారు. టికెట్లు రాని వారిని అభ్యర్థులు కలుపుకుపోవాలని ఆదేశించారు.

టీఆర్ఎస్ అభ్యర్థులెవరిలో విజయగర్వం లేకుండా అందరూ అణకువగా పనిచేయాలని అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మంచినీటి సమస్య 95 శాతం పరిష్కారమైందని తెలిపారు. కేశవాపురం రూపుదిద్దుకుంటోందని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను పెంచుతామని తెలిపారు. 137 కొత్త లింకు రోడ్లను ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించామని వెల్లడించారు.

హైదరాబాద్ కోసం చేసిన ఒక్కపనినైనా… చూపెట్టే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అభివృద్ధి కవాలా?… అరాచకం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇవి కీలకమైన ఎన్నికలు అని.. ఈ ఎన్నికలతో ప్రజలే నిశ్చయించుకోవాలని తెలిపారు. ప్రజల కష్టంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం తోడుంది అని గుర్తు చేశారు. కరోనా సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాం… వరదల సమయంలో ప్రజలకు తోడుగా నిలిచామని అన్నారు.


Next Story