కిషన్‌రెడ్డి ఒక నిస్సహాయ మంత్రి !

by  |
కిషన్‌రెడ్డి ఒక నిస్సహాయ మంత్రి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కిషన్‌రెడ్డి పేరుకే కేంద్రసహాయ మంత్రి తప్ప ఆయన నిజానికి ఒక నిస్సహాయ మంత్రి అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినా వారంతా అసమర్ధులేనన్నారు. వర్షాలు, వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్రాన్ని తక్షణ సాయంగా రూ.1,350కోట్లు ఇవ్వాలని సీఎం కోరితే ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు (2017లో) రూ.500కోట్లు, కర్నాటకకు రూ.669కోట్లు వెంటనే ఇచ్చిందని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సుమారు రూ. 8,868కోట్ల మేర వరద నష్టం జరిగిందని సీఎం లేఖ రాసి నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ స్పందన లేదన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

వరదల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.554కోట్లతో ఆదుకుంటోందని, ఇప్పటివరకు 4.30లక్షల మందికి రూ.10వేల చొప్పున నగదు సాయం అందించిందన్నారు. లబ్ధిదారులందరి వివరాలు, సంపూర్ణ సమాచారం జీహెచ్ఎంసీ దగ్గర ఉందని, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70లక్షల కోట్ల మేర వెళ్తూ ఉంటే తిరిగి కేవలం రూ. 1.40లక్షల కోట్లు మాత్రమే వస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.

కాంగ్రెస్ హయాంలోనే నాలాల ఆక్రమణ

నగరంలోనూ, చుట్టుపక్కలా చెరువులు, నాలాల్లో ఆక్రమణలు ఇప్పటికిప్పుడు వచ్చినవేమీ కావని, కాంగ్రెస్ హయాంలో ఉన్నాయని, తమ దగ్గర ఉన్న కిర్లోస్కర్ కమిటీ, వోయెంట్స్ కన్సల్టెన్సీ, హైదరాబాద్ జేఎన్టీయూ అధ్యయనం నివేదికలన్నీ దీన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. అప్పటికే సుమారు 28వేల ఆక్రమణలు ఉన్నట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోందన్నారు. నగర ప్రజల పట్ల అక్కర ఉంటే గతంలో బస్తీ దవాఖానలను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వరదలు వచ్చినా తృప్తిగా చేసుకునే దసరా పండుగ కోసం చేతిలో నాలుగు డబ్బులు అవసరమని గుర్తించిన ప్రభుత్వం 920బృందాలతో లక్ష మందికి ఒకే రోజున రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు.

Next Story

Most Viewed