గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.. 3 రోజుల్లో వారి చేతికి డబ్బులు

by  |
గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.. 3 రోజుల్లో వారి చేతికి డబ్బులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా వెంటనే తయారుచేసి, పెన్షన్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆసరా పెన్షన్లు, వయోపరిమితి తగ్గింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలను మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పెన్షన్లు పొందడానికి కనీస వయస్సును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించారని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి మూడు రోజుల్లోగా పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను అదేశించారు.

అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు, ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలను 100% బ్రతికే విధంగా ప్రత్యేక చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు.

గ్రామపంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇతర సాగునీటి వనరులను వినియోగించుకుని వర్షాకాలంలో నాటిన మొక్కలకు వాటరింగ్ చేయాలని ఆయన కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు పనుల సోషల్ ఆడిట్ మానిటరింగ్ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డీఆర్‌డీవో ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన చెప్పారు.

సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దయాకర్ రావు అదేశించారు. అదేవిధంగా డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే పంపు మెకానిక్‌ల సమస్యలు పరిష్కరించడానికి చర్యల నిమిత్తం తగిన రిపోర్టును తమకు సమర్పించాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కొరకు నివేదిక సమర్పించాలని ఆయన కోరారు.

అంతేకాకుండా చిన్న చిన్న మర్మమత్తులు వెంటనే చేపట్టి వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా రోడ్లను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed