బీజేపీ సిద్ధాంతాలు ఇవేనా?.. అర్వింద్‌పై మంత్రి ఫైర్

by  |
errabelli dayakar rao
X

దిశ, వరంగల్: ప్ర‌జ‌లు క‌రోనా క‌ష్టాల్లో ఉంటే బీజేపీ దిగ‌జారుడు రాజ‌కీయాలేంటి?, అర్వింద్ వ‌రంగ‌ల్‌కు ఉద్దేశ పూర్వ‌కంగానే వ‌చ్చి, వివాదాలు సృష్టించారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయ‌న ఎంపీ అన్న విషయం కూడా మ‌ర‌చి మాట్లాడుతున్నారని మా పార్టీ ఎమ్మెల్యేల‌పై నిరాధార అనుచిత వ్యాఖ్య‌లు చేశారని మండిపడ్డారు. కావాల‌నే క‌య్యానికి కాలు దువ్వుతున్నారని, బ్లాక్ మెయిలింగ్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారని విమర్శించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఉసి గొల్పి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారని దుయ్యబట్టారు. రాజకీయ మైలేజీకే త‌మ ప‌ద‌వుల‌ను, పార్టీని వాడుకుంటున్నారని, ఇది రాజ‌కీయాలు చేసే స‌మ‌య‌మా? ప‌్ర‌జ‌ల‌ను ఆదుకునే స‌మ‌య‌మా? అని మంత్రి ప్రశ్నించారు. ఎవ‌రి శ్రేయస్సు కోసం ఈ రాద్ధాంతాలు?, బీజేపీ సిద్ధాంతాలు ఇవేనా?, మీ ప్ర‌వ‌ర్త‌న ద్వారా మీరు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారని అడిగారు. రాజకీయాల్లో ఉన్న వారు కాస్త బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలని, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ క్యాంపు కార్యాల‌యంపై దాడి అప్ర‌జాస్వామికని ఖండించారు. అర్వింద్ మాజీ ఎంపీ క‌విత‌, మా చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ పై చేసిన వ్యాఖ్య‌ల్ని భేష‌ర‌తుగా విర‌మించుకొని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయాలు మానుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.


Next Story

Most Viewed