ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నాం.. మంత్రి అనిల్

by  |
ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నాం.. మంత్రి అనిల్
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 50వ డివిజన్ సంతపేటలో శనివారం సాయంత్రం పర్యటించిన ఆయన కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్‌లలో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్పొరేషన్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ గెలుపు తమకు సొంతమవుతుందన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక పింఛన్ ఇవ్వాలన్నా అది వైసీపీతోనే సాధ్యమన్నారు. మరోవైపు టీడీపీకి ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

టీడీపీ అభ్యర్థి గెలిచినా నా దగ్గరకు వచ్చి కండువా కప్పుకుంటారు

కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకునే సరికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్ష పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పొరపాటున ఒకరిద్దరు టీడీపీ కార్పొరేటర్ల గెలిచినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం ఖాయమని మంత్రి అనిల్ జోస్యం చెప్పారు. పార్టీ కండువా కప్పుకుని తమ పార్టీలోకి చెరుతారని ఇది మామూలుగా జరిగే ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. గతంలో అనేకసార్లు ఇలాంటివి జరిగాయన్నారు. టీడీపీ తరఫున గెలిచి తన దగ్గరకు వచ్చి వైసీపీ కండువా కప్పుకునేవాళ్ళు ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది అంటూ మంత్రి అనిల్ ప్రజలను ప్రశ్నించారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఓటు వేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

2024లో నెల్లూరులో పోటీ చేసేది నేనే

2009, 2014, 2019లో నెల్లూరు నగరం నుంచి నేనే పోటీ చేశా. 2024లో కూడా నేనే పోటీ చేస్తా. నన్ను పొగిడినా, తిట్టినా.. నాకు ఓటు వేసిన, వేయకపోయినా 2009లో 2014, 2019, 2024 లో కూడా నెల్లూరులో ప్రజల ముందుకు వచ్చి ప్రజాతీర్పు కోరేది నేనే. కానీ తెలుగుదేశం పార్టీలో 2009కి ఒకరు 2014కి మరొకరు 2019 ఇంకొకరు, 2024 గాలిలో ఇంకొకరు ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా ఆ పార్టీ నేతలకే తెలియదని చెప్పుకొచ్చారు. తనకు ఓటు వేసినా వేయకపోయినా నెల్లూరు ప్రజల ముందే ఎన్ని సంవత్సరాలైనా తాను నిరంతరం తిరుగుతుంటానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.

Next Story