మెట్రో నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపే!

by  |
మెట్రో నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 3వ తేదీన లాక్‌డౌన్ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర సర్కారు రెడ్‌జోన్‌ ఏరియాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం కనిపిస్తున్నప్పటికీ.. మహమ్మారిని కట్టడి చేసేందుకు కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రెడ్ జోన్‌లలో కఠిన ఆంక్షలను కేంద్రం అమలు చేయనుంది. రెడ్ జోన్‌ల జాబితాను ప్రతివారం సమీక్షిస్తూ ఆయా ఏరియాల్లో ఈ ఆంక్షలను కొనసాగించనుంది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ ప్రీతి సుదాన్.. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ జిల్లాల జాబితాను కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించారు. దేశంలో కరోనా కట్టడికి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాలలో కఠిన ఆంక్షలు అమలు తప్పనిసరి అని ప్రీతి సుదాన్ తెలిపారు. రాష్ట్రాలకు పంపించిన జాబితాలో 130 రెడ్ జోన్‌లున్నాయి. 284 ఆరెంజ్ జోన్‌లు, 319 గ్రీన్ జోన్‌ జిల్లాలున్నాయి. రెండు వారాల క్రితం విడుదల చేసిన జాబితాలో 170 రెడ్ జోన్‌లు, 207 ఆరెంజ్ జోన్‌లు, 353 గ్రీన్ జోన్ జిల్లాలుండటం గమనార్హం. కాగా, మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ సహా మెట్రో నగరాలున్నాయి. ఇవన్నీ మే 3వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్ ఆంక్షల్లోనే కొనసాగనున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా రెడ్ జోన్‌ల సంఖ్యను చూస్తే.. యూపీలో అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19 రెడ్ జోన్‌లుండగా, మహారాష్ట్రలో 14 రెడ్ జోన్‌లు, తమిళనాడు 12 రెడ్ జోన్‌లు ఉన్నాయి. వీటికితోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ పరిస్థితులను బట్టి మరిన్ని రెడ్ జోన్‌లను ప్రకటించవచ్చు. కానీ, కేంద్రం గుర్తించిన రెడ్ జోన్‌లను సడలించే అధికారం రాష్ట్రాలకు ఉండబోదు.

28 రోజులు కాదు.. 21 రోజులే..

ప్రతివారం కేంద్రం.. రెడ్ జోన్‌ల జాబితాను సమీక్షించనుంది. ఈ క్రమంలో ఏరియాలు ఒక జోన్ నుంచి మరో జోన్‌లోకి వెళ్లవచ్చు. రెడ్ జోన్ నుంచి లేదా ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌(ఒక్క కేసు కూడా లేని ఏరియా)లోకి మారుతుంటాయి. గడిచిన 28 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని ఏరియాను గ్రీన్ జోన్‌గా కేంద్రం ఇప్పటి వరకు గుర్తించింది. కానీ, తాజా మార్గదర్శకాల్లో ఈ 28 రోజుల కాల వ్యవధిని 21 రోజులకు కుదించింది. రెడ్ జోన్‌ల జాబితాను ప్రతివారం రూపొందించనుంది. రెడ్ జోన్ గుర్తింపు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇప్పటి వరకు కొత్తగా ఒక జిల్లా రెడ్ జోన్‌గా గుర్తించాలంటే.. కొత్తగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూడటం, రెట్టింపు కేసులు నమోదవడం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించేవారు. ఇప్పుడు వీటికితోడు.. కరోనా టెస్టుల విస్తృతి, నిఘా, రాష్ట్రాల నుంచి ఫీడ్‌బ్యాక్ వివరాలనూ పరిశీలించి రెడ్ జోన్‌లను గుర్తించనున్నారు.

Tags: coronavirus, metro cities, red zones, centre, guidelines, states, declaration, lockdown, relaxation



Next Story

Most Viewed