మారుతీరావు సూసైడ్‌‌కు కారణాలు ఇవేనా ?

by  |
మారుతీరావు సూసైడ్‌‌కు కారణాలు ఇవేనా ?
X

దిశ నల్లగొండ: సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు సూసైడ్‌‌కు పాల్పడ్డారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్య వైశ్య భవన్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకొని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో 2018, సెప్టెంబర్‌ నెల‌లో హత్య చేయించారు. ఐఎస్ఐ తీవ్రవాద కేసులున్న అజ్ఘర్ అలీ ఈ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మారుతీరావుతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. 8నెలల క్రితం మారుతీరావుకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఇటీవలే బెయిల్‌ను దుర్వినియోగం చేశారని మారుతీరావుపై మరో కేసు నమోదయ్యింది.

మరోసారి కేసు పెట్టిన అమృత !
ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తిని రాసిస్తానని కొద్దిరోజుల క్రితం మారుతీరావు మధ్యవర్తులతో అమృతకు రాయబారం పంపారు. దీనిపై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో తనను కాంప్రమైజ్ కావాలంటూ బెదిరిస్తున్నారని తెలపడంతో మారుతీరావు, ఆయనకు మద్దతుగా వెళ్లిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు 10 రోజుల క్రితం మారుతీరావుకు చెందిన షెడ్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యం కావడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే ప్రణయ్ హత్య కేసులో కోర్టు విచారణను వేగవంతం చేసింది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజీతో పాటు ఇతర సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. కూతురు దూరమైందన్న మనస్తాపంతో పాటు ప్రణయ్ హత్య కేసులో శిక్ష పడుతుందనే భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు ఆస్తి వ్యవహారాలు కూడా ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిన్న రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు ఎంతకీ బయటికి రాకపోవడంతో సిబ్బంది గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మారుతీరావు చనిపోయి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story