భారీగా పెరిగిన మారుతీ సీఎన్‌జీ వాహన అమ్మకాలు

by  |
భారీగా పెరిగిన మారుతీ సీఎన్‌జీ వాహన అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.57 లక్షలకు పైగా సీఎన్‌జీ కార్లను విక్రయించినట్టు బుధవారం తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1,06,444 సీఎన్‌జీ యూనిట్లను విక్రయించింది. మారుతీ సుజుకి ఆల్టో, సెలెరియో, వ్యాగన్-ఆర్, ఎస్-ప్రెసో, ఈకో, ఎర్టిగా సహా పలు సీఎన్‌జీ కార్లను విక్రయిస్తోంది. ఇటీవల మారిన పరిస్థితులు, కాలుష్యంపై పెరిగిన అవగాహన నేపథ్యంలో సీఎన్‌జీ మొబిలిటీ విభాగంలో అమ్మకాల వృద్ధిని చూశాము. కంపెనీ వినియోగదారుల కోసం విస్తృతంగా సీఎన్‌జీ కార్లను విక్రయిస్తోంది.

‘ఇటీవల పెట్రోల్ ధరలు పెరగడం, ఆర్థిక భారం కారణంగా ఇంధన వినియోగ వాహనాల కంటే సీఎన్‌జీ వాహనాలను డిమాండ్ పెరిగింది. దీనికి తోడు సీఎన్‌జీ ఫిల్లింగ్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగవుతున్నట్టు’ మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. దేశవ్యాప్తంగా సీఎన్‌జీ మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో సీఎన్‌జీ వాహనాలను తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. చమురు దిగుమతిని తగ్గించేందుకు ప్రభుత్వ లక్ష్యానికి కంపెనీ సీఎన్‌జీ కార్ల మోడళ్లను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సీఎన్‌జీ వాహనాల వాటా 6.2 శాతం ఉండగా, దీఎని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,800కి పైగా సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయి. వీటి సఖ్యను రాబోయే 7-8 ఏళ్లలో 10 వేలకు పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది.


Next Story