హెచ్చరిక: అడవుల్లో అన్నలకు డేంజర్ బెల్స్

by  |
హెచ్చరిక: అడవుల్లో అన్నలకు డేంజర్ బెల్స్
X

దిశ, భద్రాచలం : ఆకులు రాలే వేసవికాలం అడవుల్లో అన్నలకు ప్రాణగండం పొంచి ఉంటుంది. ప్రతీ ఏడాది మండు వేసవిలోనే ఎన్‌కౌంటర్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఫలితంగా మావోయిస్టు నక్సల్స్‌కి భారీ నష్టం‌ వాటిల్లుతుంది. గతంలో జరిగిన అనేక సంఘటనలే దీనికి సాక్ష్యం. వేసవి వస్తోందంటే అడవుల్లో అన్నలకి ఆందోళన మొదలవుతుంది. త్రాగడానికి నీరు దొరకదు. తలదాచుకోడానికి నీడ ఉండదు. అందుకే వేసవిలో మావోయిస్టులు మకాం మార్చుతారని తెలుస్తోంది.

కూంబింగ్‌కి అనుకూలమైన కాలం

మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టే కూంబింగ్‌కి వేసవి ఎంతో అనువైన కాలం. వర్షాకాలంలో వాగులు, వంకలు, వాటికితోడు చెట్లు గుబురుగా పెరిగి పక్కనున్న మనుషులు కనిపించనంతగా అల్లుకపోయి ఉంటాయి. ఆ సమయంలో భద్రతా బలగాలను గుర్తించడానికి చేయడానికి మావోయిస్టులకు అనుకూలం. కానీ వేసవిలో అలా కాదు. చెట్ల ఆకులన్నీ రాలిపోయి మైదానంలా మారి దూరంగా ఉండే మనుషులు కూడా కనిపిస్తారు. పోలీసులకు ఇది అనువైనదిగా చెప్పవచ్చు. వేసవిలోనే మావోయిస్టులకు ఎక్కువ నష్టం జరగడం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. ఇలాంటి పరిస్థితుల కారణంగానే వేసవి దృష్ట్యా మావోయిస్టులు దండకారణ్యం వదిలి గోదావరి పరివాహక ప్రాంతాల్లో తలదాచుకోవడానికి వలస వస్తున్నట్లుగా ఇప్పటికే పోలీస్ నిఘా వర్గాలు పసిగట్టడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనారు.

డ్రోన్‌ల సహాయంతో వేట

దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను కనిపెట్టడానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమైంది. సీజీ పోలీసులు సరికొత్త టెక్నాలజీ కలిగిన మెగా డ్రోన్ ఇటీవల జగదల్‌పూర్ ఎయిర్ పోర్టు వద్ద ధ్వంసమైన విషయం తెలిసిందే. డ్రోన్ కెమెరాలు వచ్చాక గగనతలం నుంచే అనుమానిత ప్రాంతాలపై నిఘా పెట్టి పోలీసులు మావోయిస్టుల కదలికలు కనిపెడుతున్నారు. ఓవైపు ఇన్ఫార్మర్ వ్యవస్థని పటిష్టం చేసుకున్న పోలీసు యంత్రాంగం, మరోవైపు అధునాతన టెక్నాలజీ సాయంతో మావోయిస్టులు అమర్చే బూబీట్రాప్స్, ఐఈడీలను ముందుగానే గుర్తిస్తున్నారు. అంతేగాకుండా పోలీసులతో కాల్పులు జరిగినపుడు ఎక్కువగా మావోయిస్టులకే నష్టం జరుగుతోంది. ఇవన్నీ మావోయిస్టులకు మింగుడు పడని అంశాలుగా పేర్కొనవచ్చు.


Next Story

Most Viewed