వివాహితతో తమ్ముడి పెండ్లి.. నిద్రమాత్రలు మింగిన అన్న

by  |
వివాహితతో తమ్ముడి పెండ్లి.. నిద్రమాత్రలు మింగిన అన్న
X

దిశ, జగిత్యాల: ప్రియురాలు పెండ్లి చేసుకున్న 8 నెలల తర్వాత ప్రియుడు అత్తింటివారికి, కుటుంబీకులకు షాకిచ్చాడు. ఆమెను తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి బంధువులు ఆచూకీ చెప్పాలని ప్రియుడి అన్నపై దాడి చేసి బెదిరించడంతో నిద్రమాత్రలు మింగాడు బాధితుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్, తక్కలపల్లికి చెందిన ఓ అమ్మాయి గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఒప్పుకోని తల్లిదండ్రులు 8 నెలల క్రితం వేరే అబ్బాయితో పెండ్లి జరిపించారు. అయినప్పటికీ ప్రియురాలు-ప్రియుడు పెండ్లి చేసుకొని పారిపోదామని నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో జూలై 26న పథకం ప్రకారం వివాహిత(ప్రియురాలు)ను తీసుకెళ్లిన శ్రావణ్ పెండ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు ఆగ్రహంతో శ్రావణ్ ఇంటిపై, సోదరుడు సాగర్‌పై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా ఆచూకీ తెలపాలంటూ పలుమార్లు బెదిరించారు. ఇక వారి బెదిరింపులు తాళలేక సాగర్ ఆదివారం రాత్రి సూసైడ్ అటెంప్ట్ చేస్తూ.. సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం బాధితుడి వద్దకు చేరుకున్న బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. ఇదే సమయంలో బాధితుడి నుంచి రెండవ అదనపు జడ్జి సమక్షంలో డీఎస్పీ వెంకటరమణ వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story