'టీఆర్ఎస్ ప్రచారం కాంగ్రెస్‌కే లాభం'

by  |
mallu ravi comments
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేవని, అందుకే కాంగ్రెస్‌వాది అయిన మాజీ ప్రధాని పీవీ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడిగే స్థాయికి టీఆర్ఎస్ దిగజారిందని, పీపీ జాతీయ, అంతర్జాతీయ నేత… అలాంటిది ఆయనను ఒక ప్రాంతీయ పార్టీకి ప్రచారంగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఇప్పుడు ఓడి పోతామనే భయంతో పీవీ ఫోటోతో ఓట్లు అడుగుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.

పీవీ నర్సింహారావు జీవితకాలం కాంగ్రెస్2లోనే ఉన్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ఏఐసీసీ అధ్యక్షులుగా ఎదిగారన్నారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అయ్యారని, ఇంత గొప్ప మేధావిని గుర్తించి అన్ని రకాలుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఈ మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డికి పీవీ ఫోటో పెట్టి వ్యాపార ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదని, టీఆర్ఎస్ ఇచ్చిన ప్రకటనలో పీవీని గుర్తు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందని, పీవీ అభిమానులు కాంగ్రెస్ వైపు మాత్రమే ఉంటారని మల్లు రవి పేర్కొన్నారు. పీవీ బొమ్మ పెట్టి ప్రచారం చేసి కాంగ్రెస్‌కు ఉచిత ప్రచారం ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పీవీకి గౌరవం ఇవ్వలేదని, కనీసం దహన సంస్కారాలకు కూడా కేసీఆర్ వెళ్లలేదని మల్లు గుర్తు చేశారు. పీవీ బతికున్న కాలంలో ప్రధానిగా ఉండి తెలంగాణకు ఏం ఒరగబెట్టారని కేసీఆర్ నిందించారని, ఇప్పుడు రాజకీయాల కోసం లేని ప్రేమను ఒలకబోస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ రాజకీయ నాటకాలన్నీ తెలంగాణ ఓటర్లు గమనిస్తున్నారని, పీవీ బొమ్మతో టీఆర్ఎస్ ప్రచారం కచ్చితంగా కాంగ్రెస్‌కే మేలు జరుగుతుందని మల్లు రవి అన్నారు.


Next Story

Most Viewed