అలవాట్లలో మార్పులు.. ఆరోగ్యానికే ప్రాధాన్యం

by  |
అలవాట్లలో మార్పులు.. ఆరోగ్యానికే ప్రాధాన్యం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు జీవితాల్లోనూ ఎన్నో మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ప్రజల జీవనం కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నంతగా మారిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా నెలల పాటు ఇంటికే పరిమితమైన జనం గత కొద్ది రోజులుగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మనసులో మెదిలే భయాందోళన నడుమ మున్ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవనయానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ భయంతో కొన్ని విషయాల జోలికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ కొత్త తరహా జీవితానికి నాంది పలుకుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా ప్రభావం విద్య ,వైద్యం, వ్యాపార రంగాలపై పెను ప్రభావం చూపింది. ప్రజలు కరోనాకు ముందు గత ఏడాది ఎలా ఉన్నాము, ఇప్పుడెలా ఉంటున్నాం, జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు, చేర్పులు తదితర అంశాలను నెమరేసుకుంటున్నారు.

విద్యారంగంపై ..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 ప్రభావం 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలపై తీవ్రంగా పడింది. గత ఏడాది నిర్వహించిన తరగతులకు ఈ ఏడాది మార్చిలో ఇంటర్ , డిగ్రీ పరీక్షలు నిర్వహించవలసి ఉండగా కొవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఇలా పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లిన 2020 సంవత్సరం చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీల ద్వారా బోధిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పునర్వినియోగించే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు భావించే వారు. కరోనాతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఒక్కసారి వాడిపారేసే పెన్నులు, సంచులు, తినుబండారాల ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు. తదితర వస్తువుల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలుష్య కారక వస్తువులకు దూరంగా ఉంటున్నారు. వస్తువులను తాకేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు.

మారిన జీవన శైలి..

కరోనా కారణంగా ప్రజల జీవన విధానంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం కరోనా ప్రారంభం నుంచి కొత్తగా వచ్చి చేరాయి . తినే ఆహారంలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటి బయట తినాలంటే భయపడే విధంగా ప్రజలలో మార్పు తెచ్చింది. వేడి వేడి ఆహారం, మరిగించి చల్లార్చిన నీళ్లు , పండ్ల రసాలు అధికంగా తీసుకోవడం మొదలైంది. దగ్గు , జలుబు వస్తే గతంలో చిన్న విషయాలుగా పరిగణించే వారు. ఇప్పడు అటువటి పరిస్థితి లేదు. ఏ మాత్రం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పించినా భయాందోళనకు గురై టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. ఇంట్లో ఆవిరి పడుతున్నారు. ఇలా రోగ నిరోధక శక్తి పెంచుకున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తుండడంతో విష జ్వరాల ప్రభావం పూర్తిగా తగ్గనప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కారణంగా లాక్‌డౌన్‌ విధించక ముందు వరకు ఎవరైనా నడిచి వెళ్తుంటే వాహనదారులు ఆగి మరీ లిఫ్టు ఇచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పుడు కరోనా భూతం కారణంగా లిఫ్టు అడిగినా ఆపేందుకు వాహనదారులు జంకుతున్నారు. తెలిసిన వ్యక్తులకు దూరంగా ఉంటున్న రోజులలో తెలియని వ్యక్తులకు లిఫ్ట్‌ ఎలా ఇస్తామంటూ పట్టించుకోకుండా వెళ్లి పోతున్నారు.

పెరిగిన పార్సిల్ సర్వీస్..

లాక్‌డౌన్‌కు ముందు చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు రద్దీగా కనిపించేవి. కొన్ని నెలల పాటు వీటిని మూసివేయగా ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినా భోజన ప్రియులు మాత్రం తినేందుకు జంకుతున్నారు. పది మందిలో కలిసి తింటే కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుందన్న భయంతో కేవలం పార్సిల్‌ సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చుని తినాలంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి. పార్సిల్‌ తీసుకెళ్లడం ద్వారా ఇంట్లోనే ఉండి తినే వీ లుంటుంది. ఇలా 2020 సంవత్సరంలో కరోనా కారణంగా ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుని ప్రతి ఒక్కరిలో మరుపు రాని అనుభూతులను మిగిల్చింది.

తగ్గిన దావత్‌లు..

నేడు కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా విందులు చేయాల్సిందే . ఏ చిన్న విజయం సాధించినా ‘దావత్‌ ఎప్పుడు మామా’ అని అడగడటం చాలా మందికి అలవా టు. అయితే కరోనా ఇలాంటి వాటన్నింటికి చెక్ పెట్టింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు దావత్‌ల ద్వారా విస్తరిస్తున్నవే. సరదాగా గడిపేందుకో లేక పుట్టిన రోజన ఒకచోట చేరి పార్టీ చేసుకున్న సందర్భాల్లో కరోనా పంజా విసురుతోంది. దీంతో వీలైనంత వరకు ప్రజలు దావత్ లను దూరంగా పెడుతున్నారు . ఇక ప్రయాణాలు కూడా ఆర్టీసీ బస్సులలో వీలైనంత తగ్గించి సొంత వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్నారు.

పెరిగిన అవగాహన..

కరోనాతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇంటి భోజనం చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల సంఖ్య తగ్గింది. కాచి వడబోసిన నీటిని తాగడం వల్ల టైపాయిడ్‌, పచ్చకామెర్లు వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఫీవరాసుపత్రికి సీజనల్‌ వ్యాధులతో వచ్చినవారి సంఖ్య 2019 కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. వైరల్‌ జ్వరాలు, కరోనా లక్షణాలు ఒకేలా కన్పిస్తుంటాయి. వైరల్‌ ఫీవర్ లో జలుబు, దగ్గు, గొంతు నొ ప్పి, ఒళ్లు నొప్పులు, కొందరిలో విరేచనాలు అవుతుంటాయి. కరోనా లక్షణాలు సైతం ఇలానే ఉండటంతో గుర్తించడం చాలా కష్టమని వైద్యులు చేసిన సూచనలు ప్రజలను ఆలోచించేలా చేశాయి. కరోనా భారిన పడకుండా ఉండేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed