జగిత్యాలలో మహాధర్నా.. మద్దతు ధర కోసం కదం తొక్కిన రైతులు

by  |
జగిత్యాలలో మహాధర్నా.. మద్దతు ధర కోసం కదం తొక్కిన రైతులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లా రైతాంగం మరోసారి కదం తొక్కింది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మెట్‌పల్లిలో మహాధర్నా నిర్వహించి.. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. మేడిపల్లి, రాయికల్, కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన రైతులు మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత రైతులు మాట్లాడుతూ.. ముత్యంపేట చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలని, మొక్కజొన్న, వరి పంటలకు మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు క్వింటాలుకు రూ. 15 వేల మద్దతు ధర ఇవ్వాలన్నారు. డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. లేనట్టయితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, గత ఏడాది రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.



Next Story