లాటరీ పేరుతో లూటీ… వాట్సప్ కాల్‌లో…

by  |
whatsapp lottery scam
X

దిశ, చేవెళ్ల : లక్కీ డ్రా వచ్చిందంటూ వాట్స్అప్ ఆడియో కాల్ చేసి డబ్బులు కాజేసిన సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు మోస పోయిన తర్వాత శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం హరికృష్ణ ఫోన్ కు హిందీ లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి ఈనెల 12వ తేదీన వాట్స్అప్ ఆడియో కాల్ చేశాడు. మీకు 25 లక్షలు లక్కీ డ్రా వచ్చింది. ఆ డబ్బులు మీకు రావాలంటే కొంత డబ్బు పంపించాల్సి ఉంటుందని చెప్పాడని బాధితుడు పేర్కొన్నారు.

అందుకుగాను బ్యాంక్ వివరాలు పంపించాలని కోరడంతో పాటు రూ.12వేలు నగదు పంపించాలని దానికి అదనంగా టాక్స్ కూడా పడుతుందని చెప్పాడు. దీనికిగాను మీ బ్యాంకు ఖాతా సేవింగ్స్ ఖాతా ఉన్నందున మరికొంత అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని సైబర్ నేరగాడు బాధితుని తో ఫోన్లో మాట్లాడుతూ వివరించాడని తెలిపారు. దీంతో సుమారు గా రూ.50వేల వేల వరకు గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు. తదనంతరం ఈనెల 13వ తేదీన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సోమవారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోపినాథ్ తెలిపారు. కాగా ఇప్పటికే శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ మోసాలు నాలుగు జరిగినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్ల పట్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా ఎక్కడో ఎవరో ఒకరు ఇలాంటి మోసాలకు గురి కావడం చర్చనీయాంశమైంది.

Next Story