లాక్‌డౌన్ కొనసాగింపు..?

by  |
లాక్‌డౌన్ కొనసాగింపు..?
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌పై సమీక్షించేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 3గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? మే 3తర్వాత లాక్‌డౌన్ కొనసాగించాలా, వద్దా? అన్న అంశాలపై ప్రధానంగా చర్చింనట్టు తెలుస్తోంది. ఈ చర్చల్లో లాక్‌డౌన్ కొనసాగింపునకే మోడీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే, దేశవ్యాప్తంగా కాకుండా, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సీఎంలతో మోడీ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉందని భరోసా ఇచ్చారు. గత నెలన్నర రోజులుగా విధించిన లాక్‌డౌన్ వల్ల వేలాదిమంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. అలాగే, కరోనా ప్రభావాన్ని బట్టి ఆయా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా గుర్తించి, లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎంలకు సూచించారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు చూపుతున్న చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూనే, కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో చర్చించిన మరిన్ని విషయాలను పరిశీలించినట్టయితే.. మే 3 తర్వాత కార్లు, బైకులు వంటి ప్రైవేటు వాహనాలకు అనుమతినిచ్చే అవకాశముండగా, ప్రజారవాణాకు మరికొన్ని రోజులు అనుమతి లభించకపోవచ్చు. విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగనునట్టు స్పష్టమవుతోంది. అలాగే, తొమ్మిది మంది సీఎంలు పాల్గొన్న ఈ సమావేశంలో ఐదుగురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయాలని కోరగా, మేఘాలయ, ఒడిశా సీఎంలతో పాటు మరో ఇద్దరు కొనసాగించాలని కోరినట్టు తెలుస్తోంది. కరోనా కేసులు తక్కువగా నమోదైన ఆరెంజ్ జోన్లలో, నమోదుకానీ గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పున:ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి డుమ్మా కొట్టారు. ఆయనకు బదులుగా ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని పంపారు.

Tags: modi video conference, modi, pm, chief minister, lockdown, coronavirus, covid 19, kerala,

Next Story