వారెవ్వా.. హోజగిరి

by Daayi Srishailam |

ఈశాన్యం నుంచి దేశవ్యాప్తంగా.. గవర్నర్ మది దోచిన నృత్యం

వారెవ్వా.. హోజగిరి
X

వేదిక : ఐఐటీ హైదరాబాద్, కంది, సంగారెడ్డి

ఈ నెల 26న..

స్పీక్ మెకాయి ఆధ్వర్యంలో..

10వ సాంస్కృతిక సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన..

త్రిపుర రాష్ట్ర రియాంగ్ వంశస్థుల హోజగిరి జానపద నృత్యాన్ని ప్రదర్శించారు.

తమ సాంప్రదాయ నృత్యమైన హోజగిరి కళను చూసి గవర్నర్ ముగ్ధుడయ్యారు.

తాను కూడా అదే రాష్ట్రానికి చెందిన వాడినని..

తమ ప్రాంత నృత్య ప్రదర్శన నేడు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడడంపై..

ఆ ప్రాంతవాసుడిగా గర్వంగా ఉందని సంబురపడ్డారు.

- మద్దికుంట శ్రీనివాస్

పున్నమి రోజున..

దేశంలోని ఈశాన్య ప్రాంతమైన త్రిపుర రాష్ట్రంలో ఈ హోజగిరి జానపద నృత్యం పుట్టింది. ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి పున్నమి రోజున ఈ నృత్య ప్రదర్శనను అక్కడి ప్రజలు చేస్తారు. రియాంగ్ (బ్రూ) వంశస్తులైన ఆడవారు మాత్రమే ఈ ప్రదర్శన చేయడం ఆనవాయితీ. యువతులు తమ తలపై, చేతులపై మట్టి కుండలు, సీసాలు, దీపాలు వంటి వస్తువులను పెట్టుకుని సమతుల్యంగా చేసుకుంటూ జానపద గీతానికి నృత్యం చేయడం ప్రత్యేకత. ఒకరిపై ఒకరు నిలుచుని వస్తువులు కింద పడకుండా నృత్యం చేయడం ఎంతో కష్టమైనా వీరు అవలీలగా చేయడం విశేషం. ఈ ప్రదర్శనలో పురుషులు డ్రమ్ము, వేణువు లాంటి వాయిద్యంతో పాటకు తగ్గట్టు సంగీతాన్ని వెనుక నుంచి అందిస్తుంటారు.

పవిత్ర నృత్యం

హోజగిరి నృత్య ప్రదర్శనను త్రిపుర ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కొండగుట్టలపై పండించిన పంటల ద్వారా మంచి దిగుబడి వచ్చి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని లాంప్రా దేవత (లక్ష్మీదేవి) ను ప్రార్థిస్తూ నృత్యం చేస్తారు. ఇందుకోసం మహిళలు సాంప్రదాయకమైన నల్ల పచ్రా, ఒంటిపై రియాను ధరిస్తారు. అలాగే నాణెం, ఉంగరాలు, పువ్వులు, ఆభరణాలతో అలంకరించుకోవడం వారి ఆచారం. ఈ నృత్యాన్ని1986లో అధికారికంగా ప్రదర్శింపజేశారు.

ఆనందంగా ఉంది: టోయిస్మతి, కళాకారిణి, త్రిపుర

తమ జాతికి చెందిన హోజగిరి నృత్య ప్రదర్శన ఐఐటీ హైదరాబాద్ లో చేయడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. మారుమూల ప్రాంతమైన తమ జానపద కళ నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుండడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఈ నృత్య ప్రదర్శన కోసం మాకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు.







Next Story