Viral : చెరువులో చేపలు.. పైన సొరకాయలు.. ఐడియా అదిరింది గురూ!

by Javid Pasha |

హిరోద్ పటేల్ స్మార్ట్ ఫార్మింగ్ విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అనేకమందిని ఆకట్టుకుంటోంది.

Viral : చెరువులో చేపలు.. పైన సొరకాయలు.. ఐడియా అదిరింది గురూ!
X

దిశ, ఫీచర్స్ : టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..! ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అవసరాలను, పరిస్థితులను బట్టి అది వ్యక్తం అవుతూ ఉంటుంది. సృజనాత్మకత రూపంలో బయటపడుతుంది. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ రైతు విషయంలో ఇది మరోసారి రుజువైంది. అతని స్మార్ట్ ఫార్మింగ్ ఆలోచన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడు?

ఒకేచోట డబుల్ ఇన్‌కం

పేరు హిరోద్ పటేల్ (HirodPatel). ఒడిశాలోని రతన్‌పూర్ గ్రామానికి చెందిన ఈ 32 ఏళ్ల రైతు వ్యవసాయ పద్ధతిలో అద్భుతం చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఏం చేశాడంటే.. అతను తన వ్యవసాయ పొలంలోనే చేపల చెరువు నిర్వహిస్తున్నాడు. అయితే అదే చెరువులో వెదరు కట్టెలతో వేసిన పందిరిపై(Trellis System) ఆనిగెపు కాయలు (సొరకాయలు) సైతం పండిస్తూ.. ఒక వైపు చేపల పెంపకం, మరోవైపు కూరగాయల సాగుతో డబుల్ ఇన్‌కం అర్జిస్తున్నాడు. ఒక సీజన్‌లో 120 సొరకాయ మొక్కల నుంచి 1,800 సొరకాయలు పండించి దాదాపు రూ. 35, 000 అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇక చెరువులోని చేపల ఆదాయం దీనికి అదనం. అతను తన సొంత ఆలోచనతో ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్‌ను క్రియేట్ చేసి అదనపు ఆదాయం పొందే పద్ధతి చాలామందికి స్ఫూర్తినిస్తోంది.

ఇంటిగ్రేటెడ్ విధానం ఎంతో మేలు..

హిరోద్ పటేల్ స్మార్ట్ ఫార్మింగ్ విధానం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అనేకమందిని ఆకట్టుకుంటోంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అతను అనుసరించిన స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ విధానం నిజానికి ఎంతో ప్రయోజనకరమైందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. చెరువులోని చేపల బురద(fish waste) ఆనిగెపు చెట్లకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ తీగ ఆధారిత మొక్కలు నీటిని సైతం శుభ్రం చేస్తాయి. కాబట్టి కూరగాయల పందిరి(Trellis) వల్ల అవి భూమికి తాకకుండా పైనే పెరిగి, శుభ్రంగా, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. తెగుళ్లు, పురుగుల సమస్యలు సైతం తగ్గుతాయి. స్థలం ఆదా అవుతుంది. నీటి వినియోగం తగ్గుతుంది. పంట కోత కూడా సులభం అవుతుంది.

Next Story