ఆపరేషన్ స్మైల్.. వెయ్యి మంది చిన్నారులకు విముక్తి

by  |
ఆపరేషన్ స్మైల్.. వెయ్యి మంది చిన్నారులకు విముక్తి
X

దిశ, క్రైమ్ బ్యూరో: బాల కార్మికులు, మిస్సింగ్ పిల్లలు, వివిధ కంపెనీలలో వెట్టి చాకిరి చేసే బాలలను గుర్తించి, వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే ఆపరేషన్ స్మైల్-7 ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఏడాది జరిగే ఈ ప్రత్యేక ఆపరేషన్ జనవరి 1 నుంచి 31 వరకు జరిగింది. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

1000 మందికి విముక్తి…

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతాల్లో దాదాపు 1000 మంది చిన్నారులకు విముక్తి లభించింది. వీరిలో బాలురు 852 మంది కాగా, బాలికలు 148 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 388మంది చిన్నారులను కాపాడగా, 344మంది బాలురు, 44 మంది బాలికలు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 223మంది చిన్నారులను కాపాడగా, 172 మంది బాలురు, 51 మంది బాలికలు ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 389 చిన్నారులను రెస్క్యూ చేయగా 336మంది బాలురు, 53మంది బాలికలు ఉన్నారు.

తల్లిదండ్రుల చెంతకు..

ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెస్క్యూ చేసిన మొత్తం 388లో 289 మందిని తల్లిదండ్రులకు చెంతకు చేర్చగా, మిగతా 99 మందిని హోంలలో చేర్పించారు. రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్న 55మంది బాల బాలికలను రెస్క్యూ చేశారు. వీరిలో 30మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు 61 కేసులను నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 223లో 100 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా, మిగతా 123 మంది యూపీ, మధ్యప్రదేశ్, ఏపీ, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌కు చెందిన వారున్నారు. ఈ ఆపరేషన్ లో రాచకొండ పోలీసులు 25 కేసులు నమోదు చేసి, 46 మందిని అరెస్టు చేశారు.


Next Story

Most Viewed